ఎన్టీఆర్ 25వ వర్థంతిః `ఎన్టీఆర్ అమరజ్యోతి` ర్యాలీని ప్రారంభించిన బాలకృష్ణ
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ని పూలమాలలతో అలంకరించారు. ఎన్టీఆర్ సమాధిని సందర్శించుకుని తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహం వద్ద `ఎన్టీఆర్ అమర జ్యోతి` ర్యాలీని ప్రారంభించారు.
బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ సమాధి వద్ద తండ్రికి నివాళులు అర్పించి తండ్రి గొప్పతనాన్ని కొనియాడారు.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సినిమాలపై ఆసక్తితో మద్రాసు వెళ్లి నటుడిగా నిరూపించుకుని, అద్బుతమైన సినిమాలు, పాత్రలు చేసి అలరించారు. ఆయన ఓ ట్రెండ్ క్రియేట్ చేశారని బాలకృష్ణ అన్నారు.
తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్, ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారని, ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు.
తెలుగు వారి ఆత్మ గౌరవం ప్రపంచం నలుమూలలకు చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే ఆవేశం వస్తుందని, ఎన్టీఆర్ పుట్టాకే ఆవేశం పుట్టిందని తండ్రి గొప్పతనాన్ని బాలయ్య కీర్తించారు.
ఎందరో మహానుభావులు తెలుగు గడ్డపై జన్మించగా, వారిలో ఒకరిగా ఎన్టీఆర్ నిలుస్తారని, ప్రముఖంగా ఉంటారని చెప్పారు. ఎన్టీఆర్కి భారతరత్న వచ్చేంత వరకు తాము పోరాడతామని బాలకృష్ణ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ సమాధిని సందర్శించుకుని తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహం వద్ద `ఎన్టీఆర్ అమర జ్యోతి` ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, కాంట్రగడ్డ ప్రసాద్, రామకృష్ణ తోపాటు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.
అనంతరం బాలకృష్ణ బసవతారకం కాన్సర్ ఆసుపత్రిని సందర్శించి రోగులకు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి పండ్లు అందజేశారు.