కరోనా విరాళాలు: తీసుకునే కోట్లు ఇక్కడివి, పైసా విదిల్చని హీరోయిన్లు
కరోనా నేపథ్యం పేద వర్గాలు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పని చేస్తే తప్ప పూట గడవని వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. సినీ రంగం నుంచి కూడా హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరోయిన్ల వ్యవహారం విమర్శలకు కారణమవుతోంది. తెలుగు సినీ రంగం నుంచి ఎంతో పొంది. కష్టసమయంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న అందాల భామ పూజా హెగ్డే. టాలీవుడ్లో టాప్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో అందుకుంటుంది. అయితే అంత సంపాదిస్తున్నా ఈ కష్ట కాలంలో కనీస విరాళం కూడా ప్రకటించలేదు. ప్రభుత్వాలకు కాకపోయినా తాను పనిచేస్తున్న సినీ ఇండస్ట్రీ కార్మికులకు కూడా సాయం చేకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
చేసింది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న భామ రష్మిక మందన్న. టాలీవుడ్ బిజీ హీరోయిన్గా ఉన్న ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కూడా నటించింది. తెలుగు ఇండస్ట్రీ తనను ఇంతగా ఆదరిస్తుంటే, కష్టకాలంలో ఆ ఇండస్ట్రీ కార్మికుల కోసం సాయం చేసేందుకు మాత్రం ఈ బ్యూటీకి మనసు రాలేదు.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా తెలుగు సినిమా మీద సీతకన్నేసింది. దక్షిణాదిలో అత్యంత పారితోషికం అందుకునే ఈ భామ, చాలా ఆలస్యంగా 20 లక్షల సాయం ప్రకటించింది. అయితే అది కూడా కేవలం తమిళ సినీ కార్మికులకు చెందిన ఫెఫ్సీకి మాత్రమే ఇచ్చింది. తనకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ఇక తెలుగులో టాప్ స్టార్ గా ఉన్న మరో హీరోయిన్ సమంత కూడా ఈ కష్ట కాలంలో సరిగా స్పందించలేదనే చెప్పాలి. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే సామ్, కరోనా బాధితులను మాత్రం పట్టించుకోలేదు. అయితే సమంత మామ నాగార్జున కోటి రూపాయలు, భర్త నాగ చైతన్య 25 లక్షలు ఇవ్వటంతో అందులో సమంత వాటా కూడా ఉందిలే అని సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.
మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం మరీ దారుణం. తెలుగు సినీ రంగం ద్వారా టాప్ స్టార్ ఇమేజ్తో పాటు కోట్ల ఆస్తులు కూడ బెట్టుకుంది రకుల్. అలాంటిది ఈ భామ ఇక్కడ ప్రజలకు ఏ మాత్రం సాయం చేయకుండా తన సొంత ఊరిలో పేదలకు భోజనాలు పెడుతోంది. అయితే ఈ విషయాన్ని పబ్లిసిటీ కోసం వాడుకోవటంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
సౌత్లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న మరో హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేసిన ఈ భామ హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటుంది. కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఈ భామ స్పందించలేదు.
ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన అందాల భామలు తమన్నా, కాజల్ అగర్వాల్. అప్పట్లో స్టార్ హీరోలందరితో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ భారీ రెమ్యూనరేషన్లే అందుకున్నారు. ఇటీవల కాస్త అవకాశాలు తగ్గిన రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా వెనక్కి తగ్గలేదు. అయినా ఈ కష్ట కాలంలో ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు ఈ అందాల భామలు.