‘పుష్ప’ స్టోరీ: భార్యాభర్తల ఎమోషన్ ...'మన్యం పులి' మసాలాతో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ను ఇప్పటికే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ అభిమానులు ఎక్సపెక్టేషన్స్ పెంచుకున్నారు. ఈ నేపధ్యం ఈ చిత్రం కథ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ స్టోరీ ..ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని వార్తలు వచ్చాయి. అది కన్ఫర్మ్ చేసింది ఫస్ట్ లుక్. అయితే ఇందులో ఎలాంటి స్టోరీని డిస్కస్ చేయబోతున్నారు సుకుమార్. ఈ లెక్కలు మాస్టారు..ఈ సినిమాకు వేసిన హిట్ లెక్కేంటి..రంగస్దలం సినిమాలాగ డిఫరెంట్ గా ఉంటుందా అనే డిస్కషన్ జరుగుతున్న ఈ సమయంలో కొన్ని కొత్త విషయాలు ఈ చిత్రం కథ గురించి బయిటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇదో ఫ్యామిలీ డ్రామా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే ఎమోషన్స్ తో కూడిన కథ అని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ,క్యూరియాసిటీ రెట్టింపు అయ్యాయి.
అయితే కేవలం భార్య,భర్తల మధ్య జరిగే కథ అయితే అల్లు అర్జున్ చెయ్యడు. అంతకు మించిన ఎమోషన్స్, కొన్ని వాస్తవిక సంఘటనలతో మిళితమై ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ కానుంది.
మోహన్ లాల్ హీరోగా వచ్చిన మన్యం పులి తరహాలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అందులోనూ మోహన్ లాల్ ఓ సామాన్య లారీ డ్రైవర్. జగపతిబాబు చేసే కొన్ని స్మగ్లింగ్ వ్యవహారాలతో ఇబ్బంది పడతాడు. అలాంటి క్యారక్టరైజేషన్ ఇక్కడ ఉండబోతోందిట.
అంతేకాదు మన్యం పులి చిత్రంలో మోహన్ లాల్ కు ఆల్రెడీ పెళ్లై ఉంటుంది. మొగుడు,పెళ్లాల మధ్య కొన్ని సరదా సన్నివేశాలు,ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అలాంటివి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతాయని వినపడుతోంది.
ఇక ఈ సినిమా ప్రారంభమయ్యే నాటికే హీరో,హీరోయిన్స్ కు పెళ్లై ఉంటుందిట. దాంతో ఈ సినిమాలో హీరో ప్రేమలో పడటం వంటి రొటీన్ లవ్ ట్రాక్ కు అవకాసం లేదట.
భర్తగా బన్ని ఇరగతీస్తాడంటున్నారు. ఓ కొత్త తరహా క్యారక్టరైజేషన్ తో దుమ్ము దులపబోతున్నాడట. చిత్తూరు యాస దానికి తోడు కానుంది. అలాగే విలన్ కు హీరో కు మధ్య సాగే సీన్స్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండబోతున్నాయి.
ఇక ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్గా నటిస్తుండగా హీరోయిన్ రష్మికా మందన్నా డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది.
తమిళ స్టార్ విజయ్ సేతుపతి పోలీసాఫీసర్గా కనిపించనున్నాడని అన్నారు కానీ ఇప్పుడు ఆయన తప్పుకున్నట్లు సమాచారం. తాజాగా విలన్ పాత్రకు సంబంధించి పుష్ప యూనిట్ బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారు. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడు.
రీసెంట్ గా రజనీకాంత్ దర్బార్ చిత్రంలోనూ విలన్గా సునీల్ శెట్టి మెప్పించాడు. తొలుత విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ అగ్ర నటులు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించినప్పటికీ సునీల్ శెట్టి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతెలాను చిత్రబృందం సంప్రదించారంటూ వార్తలు సైతం వస్తున్నాయి. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది
టైటిల్, అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న పోస్టర్లో పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. టైటిల్లో చేతి వేలి ముద్రలు కనిపిస్తుండగా.. బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయి. బన్నీ కాలికి ఆరో వేలు ఉండటం వెనుక ఏదైనా ట్విస్ట్ ఉందా? అనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.