వివాదంలో ఇరుక్కున్న క్రికెటర్ హర్భజన్ సింగ్... ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్వాలేని అమరవీరుడిగా...
భారత సీనియర్ స్పిన్నర్, ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో చంపబడిన ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్వాలేని అమరవీరుడిగా పేర్కొంట నివాళులు అర్పించాడు హర్భజన్ సింగ్. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది...
1984లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో ప్రాణాలు కోల్పోయిన ఖలీస్తానీ టెర్రరిస్ట్ జర్నీల్ సింగ్ బింద్రన్వాలేతో ఆ దాడిలో గోల్డెన్ టెంపుల్లో చంపబడినవారికి నివాళులు అర్పిస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు హర్భజన్ సింగ్.
ఈ సంఘటన జరిగి 37 ఏళ్లు అయిన సందర్భంగా పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో ప్రాణాలు కోల్పోయిన బింద్రన్వాలేతో మరో నలుగురి ఫోటోలను పోస్టు చేసి ‘అమరవీరులకు సెల్యూట్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. భజ్జీ చేసిన పోస్టులో ‘శ్రీ హర్మందిర్ సాహిబ్లో జూన్ 1 నుంచి జూన్ 6, 1984 వరకూ జరిగిన ఆపరేషన్లో వీరమరణం చెందిన అమరవీరులకు నివాళులు’ అని పంజాబీలో రాసి ఉంది.
హర్భజన్ సింగ్తో పాటు ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిల్లియర్స్ వికెట్లు తీసిన యువ క్రికెటర్ హర్ప్రీత్ బ్రార్ కూడా బింద్రన్వాలే, ఖలీస్తానీ అమరవీరులకు నివాళులు ఘటిస్తూ పోస్టులు చేయడం విశేషం.
అసలు ఎవరీ బింద్రన్వాలే... 1947లో జన్మించిన జర్నీల్ సింగ్ బింద్రన్వాలే, సిక్కు మత సంస్థ అయిన దమ్దామి తక్షాల్ హెడ్గా 1977లో బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటిదాకా ఉన్న సెంట్ కర్తర్ సింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
1978లో బౌసాఖి దినోత్సవం బింద్రన్వాలే ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అమృత్సర్ వీధుల వెంబడి సాగిన ఊరేగింపులో బింద్రన్వాలే, నిరంకరి వర్గానికి చెందినవారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో బింద్రన్వాలే ఊరేగింపులో ఉన్న 13 మందిని నిరంకరీలు దాడి చేసి చంపేశారు.
ఈ హత్యలతో సిక్కులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిరంకరీలపై దాడులు చేయడం మొదలెట్టారు. అయితే అప్పటికి పంజాబ్లో శిరోమణి అకాలీదళ్- జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో అధికారం కోసం బింద్రన్వాలేకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
1980లో అధికారంలోకి తిరిగి వచ్చింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం, బింద్రన్వాలేకి మద్ధతు ఇవ్వడంతో కొందరు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఆయన ప్రచారం కూడా చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది.
దీంతో సిక్కుల కోసం ప్రత్యేకంగా ఖలీస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ తీవ్రమైంది. రెండేళ్ల కాలంలో 1200 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందులో 1180 మంది గాయపడగా, 410 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క 1984లోనే 775 హింసాత్మక ఘటనలు జరగగా 298 మంది ప్రాణాలు కోల్పోయారు. 1983 అక్టోబర్లో ఆరుగురు హిందూ పాసింజర్లను చంపడంతో పంజాబ్లో ఎమర్జెన్సీ విధించారు. దీంతో ఖలీస్తాన్ మద్ధతుతారులు, గోల్డెన్ టెంపుల్తో పాటు అకల్ తక్త్ కాంప్లెస్ మొత్తాన్ని ఆక్రమించారు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన సిక్కు ఖైదీలు, నేరస్థులు అందరూ ఇక్కడే దాక్కున్నారు.
1984లో భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాలతో భారత ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించి, గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించింది. ఎనిమిది రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి ఖలీస్తాన్ మద్ధతుదారులను మట్టుపెట్టింది. ఈ ఆపరేషన్లో జర్నీల్ సింగ్ బింద్రన్వాలేతో పాటు అతని అనుచరులు కూడా మరణించారు.