ఒకే ఒక్కడు బాలయ్య: కుటుంబ సభ్యులంతా ఔట్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు, నందమూరి హీరో బాలకృష్ణ విజయం సాధించారు. చంద్రబాబును పక్కన పెడితే మిగతా బాలయ్య కుటుంబ సభ్యులంతా ఓటమి పాలయ్యారు. హిందూపురంలో బాలకృష్ణ 17,028 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు, నందమూరి హీరో బాలకృష్ణ విజయం సాధించారు. చంద్రబాబును పక్కన పెడితే మిగతా బాలయ్య కుటుంబ సభ్యులంతా ఓటమి పాలయ్యారు. హిందూపురంలో బాలకృష్ణ 17,028 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. విజయం కోసం బాలయ్య చాలానే కష్టపడ్డారు. ఆయన సతీమణి, కూతురు కూడా హిందూపురంలో ప్రచారం చేశారు.
కాగా, చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేష్. ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీభరత్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఖరారు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. అయితే, బాలకృష్ణ ఒత్తిడికి ఆయన తలొగ్గక తప్పలేదంటారు.
జనసేన నుంచి పోటీ చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 2 లక్షల 88 వేల 874 ఓట్లు వచ్చాయి. శ్రీభరత్ ను ఓడించడానికి జనసేన అభ్యర్థిగా ఆయనను చంద్రబాబే దించారనే ప్రచారం జరిగింది. తొలుత టీడీపీ టికెట్ ఆయనకు ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. ఆయన తీవ్రమైన విమర్శలు తలెత్తడంతో వెనక్కి తగ్గారు. దాంతో వీవీ లక్ష్మినారాయణ జనసేనలో చేరి విశాఖ నుంచి పోటీ చేశారు.
ఇకపోతే, బాలకృష్ణ సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖపట్నం లోకసభ సీటు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆమెకు కేవలం 33,892 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. గతంలో ఆమె విశాఖపట్నం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు కూడా. అయితే, 2014 ఎన్నికల్లో బిజెపి, టీడీపి పొత్తు కారణంగా ఆమె రాజంపేటకు మారాల్సి వచ్చింది. రాజంపేటలో ఆమె ఓటమి పాలయ్యారు.
బాలకృష్ణ బావ, దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివ రావుకు 97,076 ఓట్లు రాగా, దగ్గుబాటికి 95,429 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ వైఎస్ జగన్ ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేసి ఓడిపోవడం బహుశా ఇదే తొలిసారి.