చంద్రబాబుకు ఝలక్: ఇక పోరు పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్యనే..
భవిష్యత్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. రాజధాని అంశంపై చంద్రబాబు కంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడాన్ని చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లకు మధ్యనే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం జగన్ కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఏపీ రాజకీయ పోరు వారిద్దరి మధ్యనే నడుస్తూ వస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ పై పోరు సాగిస్తున్నా చంద్రబాబును దాటి వెళ్లలేకపోయారు. బిజెపి నేతలు కూడా చంద్రబాబును పక్కకు నెట్టి జగన్ ను నేరుగా ఢీకొంటున్నారనే అభిప్రాయం కలిగించలేకపోయారు. అయితే, జనసేన, బిజెపిలకు మధ్య పొత్తు ఖరారు కావడంతో పరిస్థితి మారిపోయింది.
జగన్ కు ప్రత్యామ్నాయం పవన్ కల్యాణ్ అనే అభిప్రాయం నెలకొనే పరిస్థితి రావడానికి ఎంతో కాలం పట్టేట్లు లేదు. ఇంతకాలం అమరావతి రైతుల పోరుకు మద్దతు ఇస్తూ వారి వెనక చంద్రబాబు ఉండి నడిపిస్తూ వస్తున్నారు. అయితే, అమరావతి రైతుల పోరాటాన్ని పవన్ తన చేతుల్లోకి తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మంగళవారం అమరావతి రైతులతో ఆయన మాట్లాడిన మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడం పవన్ కల్యాణ్ కు కలిసి వస్తున్న విషయం. రాజధాని అమరావతి నుంచి తరలిపోదని పవన్ కల్యాణ్ స్పష్టంగా రైతులకు చెప్పారు. ఆ మాటలను అమరావతి రైతులు విశ్వసించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పవన్ కల్యాణ్ కు ఉన్న సాన్నిహిత్యం అందుకు కారణం. అది పొత్తు వల్ల సాధ్యమైంది. లేదంటే పవన్ కల్యాణ్ కు అంత శక్తి సమకూరి ఉండేది కాదు.
ఇంత వరకు దాదాపుగా ఎదురు చూసే ధోరణిని అవలంబిస్తూ వచ్చిన బిజెపి రాజధాని సమస్యపై నేరుగా రంగంలోకి దిగింది. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ రైతుల ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం రాలేదు. జనసేనతో పొత్తు వల్ల పవన్ కల్యాణ్ ముందు పెట్టి దాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. తద్వారా చంద్రబాబును వెనక్కి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
బిజెపి వైఎస్ జగన్ ను మాత్రమే కాకుండా చంద్రబాబును కూడా లక్ష్యంగా ఎంచుకుని విమర్శలకు దిగడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జగన్ చేస్తున్న ఆరోపణలను అస్త్రాలుగా ప్రయోగిస్తోంది. ఈ విషయంలో జగన్ ను మాత్రమే కాకుండా చంద్రబాబును కూడా ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడింది.
ఇకపోతే, మంగళవారం బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టంగానే తమ వైఖరిని చెప్పారు. ఆ సమయంలో జగన్ మీదనే కాకుండా చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. ఐదేళ్లలో అమరావతిలో నాలుగు భవనాలు కూడా కట్టలేదని ఆయన చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబును, వైఎస్ జగన్ ను ఏకకాలంలో టార్గెట్ చేయడం ద్వారా పవన్ కల్యాణ్ ను ముందుకు తేవడానికి వీలవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బిజెపి వ్యూహానికి అనుగుణంగానే పవన్ కల్యాణ్ మాటలు కూడా ఉన్నాయి. జగన్ ను ఎదుర్కునే సత్తా చంద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు. జగన్ ను ఎదుర్కునే శక్తిసామర్థ్యాలు తమకు మాత్రమే ఉన్నాయని చెప్పారు. జగన్ ను ఎదుర్కోవడానికి అవసరమైన కేంద్ర సాయం తనకు దక్కుతుందనే నమ్మకంతోనే ఆయన ఆ మాటలన్నారని చెప్పవచ్చు. పైగా, రాజధాని రైతుల తరపున ఆయన కేంద్రం పెద్దలతో మాట్లాడడానికి కూడా సిద్ధపడ్డారు.