బాలుకు టాలీవుడ్ చేసిన అన్యాయం...సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న ఆయన ఫ్యాన్స్
ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుండి ఒక్కరు కూడా హాజరుకాకపోవడాన్ని ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు తన పాటలతో సేవ చేసిన బాలుకు టాలీవుడ్ సరైన గౌరవం ఇవ్వలేదని ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు.
బాలు మరణంతో ఓ ఘనమైన సంగీత అధ్యాయానికి తెరపడినట్లు అయ్యింది. అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయనకు విషాదపు వీడ్కోలు పలికారు. సెప్టెంబర్ 25న బాలు మరణించగా ఆయన అంత్యక్రియలు గత శనివారం చెన్నై శివారులో గల తామరైపాక్కం ఫార్మ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాల మధ్య నిర్వహించారు. శ్రాస్తోక్తంగా బాలు పార్దీవ దేహాన్ని ఖననం చేయడం జరిగింది. అయితే బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదు.
బాలు కరోనా కారణంగా మరణించడంతో పాటు, కరోనా ప్రభావిత నగరాల్లో చెన్నై కూడా ఒకటి. దీనిహతో టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ బాలును చివరి చూపు కూడా చూడలేదు. ఆయనకు అత్యంత సన్నిహితులు మరియు చెన్నైలో ఉన్న దేవిశ్రీ, సింగర్ మనో మాత్రమే బాలు పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగింది. టాలీవుడ్ మొత్తం మూకుమ్మడిగా బాలు అంత్యక్రియలకు హాజరు కాకపోవడాన్ని బాలు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలుగు పరిశ్రమకు ఏళ్ల తరబడి తన పాటలతో సేవ చేసిన బాలుకు ఆ మాత్రం గౌరవం ఇవ్వరా అని మండిపడుతున్నారు.
బాలుకరోనా సోకినప్పటికీ ఆయన మరణానికి ముందే కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాబట్టి బాలుకు కరోనా సోకి మరణించారన్న నెపంతో ఆయన అంతిమ సంస్కారాలు వెళ్ళకపోవడం దుర్మార్గం అంటున్నారు. తమిళ పరిశ్రమ నుండి హీరో విజయ్ లాంటి వారు హాజరుకావడం జరిగింది. కోలీవుడ్ నుండి కూడా పెద్దగా ఎవరూ హాజరు కాలేదు. వాళ్ళ సంగతి అటుంచితే బాలు తెలుగువాడు, మన పరిశ్రమకు చెందిన వాడు. అలాంటి బాలును చివరి చూపు కూడా చూడకుండా టాలీవుడ్ దూరంగా ఉండడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.