సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు మృతికి చిరు, పవన్ కళ్యాణ్ నివాళి.. ఎమోషనల్ అయిన మెగా హీరోలు..
సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు మరణవార్తతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా సినీ పెద్దలు ఆయన మృతికి నివాళి అర్పిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.
టాలీవుడ్ ఫిల్మ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (Gautam Raju) అనారోగ్యంతో నిన్న తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా రాజు ఆరోగ్య పరిస్థితి అసలేం బాలేకపోవడంతో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో పరిస్థితి విషమించి మంగళవారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలకు ఈయన ఎడిటర్ గా పనిచేశారు. దీంతో ఆయన మరణ వార్త విన్నగానే సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికన ఆయన ఫొటోలు షేర్ చేస్తూ నివాళి అర్పిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) గౌతమ్ రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదికన ఎమోషనల్ గా నోట్ రాశారు... ‘గౌతమ్ రాజు లాంటి గొప్ప ఎడిటర్ ని కోల్పోవడం బాధాకరం. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్ అంత వాడి! ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం. ‘చట్టానికి కళ్లు లేవు’ నుంచి మొన్నటి ‘ఖైదీ నెంబర్ 150’ వరకు పనిచేసిన గౌతమ్ ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు తీరని టోలు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాం తెలియజేస్తున్నాను’ అంటూ భావోద్వేగమయ్యారు.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా గౌతమ్ రాజ మృతి పట్ల చింతించారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ, నివాళి అర్పిస్తూ జనసేన పార్టీ తరుఫున ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన శ్రీ గౌతమ్ రాజు గారు తుది శ్వాస విడవటం బాధాకరం. ఎడిటర్ గా వందల చిత్రాలకు పని చేసిన అనుభవశాలి ఆయన. ఆ విభాగంలో సాంకేతికంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అందిపుచ్చుకొన్నారు. నేను నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, గబ్బర్ సింగ్, గోపాల గోపాల చిత్రాలకు గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.’ అంటూ ప్రకటనలో పేర్కొన్నాడు.