డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు హాజరైన పూరీ జగన్నాథ్
అందులో భాగంగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్లో డ్రగ్స్ కేసులో మరోసారి ఉలిక్కిపడేలా చేస్తుంది. నాలుగేండ్ల గ్యాప్ తర్వాత ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) మరోసారి టాలీవుడ్పై ఫోకస్ పెట్టింది. దాదాపు 12 మంది సినీ సెలబ్రిటీలకు నోటీసులు పంపిన నేపథ్యంలో నేటి(మంగళవారం) నుంచి విచారణ ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా తొలిరోజు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. 2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆయన్ను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగనుంది. మనీలాండరింగ్ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంక్ ఖాతాలు పరిశీలించే అవకాశం ఉంది.
ఈ వ్యవహారంలో సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.
డ్రగ్స్ కేసును సీబీఐ, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని గతంలో రేవంత్రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కేసు విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎక్సైజ్ అధికారుల నుంచి వివరాలు అందడం లేదని ఈడీ ఆరోపించింది. చివరకు ఎక్సైజ్ శాఖ కేసుల ఆధారంగా డ్రగ్స్ కేసులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని పలువురు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసింది.