ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆసక్తికర సందేశం
గతంలో రెండు పోస్టర్స్ విడుదల చేయగా, మొదటి దాంట్లో ఓ లారీలో బుక్ చదువుకుంటున్నాడు పవన్. రెండో లుక్లో కోర్ట్ సీరియస్గా ఎవరినో కొడుతున్నట్టుగా ఉంది. ఇక ఈ 2021 గిఫ్ట్ గా అందించిన లుక్ రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు పవన్.
పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న `వకీల్ సాబ్` నుంచి సర్ప్రైజ్ తీసుకొచ్చారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ సినిమాలోని కొత్త లుక్ని విడుదల చేశారు. గతంలో రెండు పోస్టర్స్ విడుదల చేయగా, మొదటి దాంట్లో ఓ లారీలో బుక్ చదువుకుంటున్నాడు పవన్. రెండో లుక్లో కోర్ట్ సీరియస్గా ఎవరినో కొడుతున్నట్టుగా ఉంది.
ఇక ఈ 2021 గిఫ్ట్ గా అందించిన లుక్ రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు పవన్. హీరోయిన్ శృతి హాసన్తో కలిసి అలా డ్యూయెట్ పాడుకుంటూ ఉన్న ఫోటోని పంచుకున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఇది తెగ ఆకట్టుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా జీరో అవర్లో దీన్ని రిలీజ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో అభిమానులున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పవన్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ఇక సంక్రాంతి కానుకగా టీజర్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు పవన్. స్ఫూర్తివంతమైన విషయాలను, కవులు, పుస్తకాల గురించి వివరించారు. తాను నటించిన `తీన్మార్` సినిమా వారణాసిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు, అక్కడి కోఆర్డినేటర్ ద్వారా రాష్ట్రకవి శ్రీ రామ్ధారి సింగ్ రాసిన సాహిత్యం పరిచయం అయ్యిందట. ఆయన అద్భుతమైన రచనలలో `పరుశ్రమ్ కి ప్రతీక్ష` తనలో ఎంతో స్ఫూర్తినింపిందని చెప్పాడు పవన్.
ఇంకా చెబుతూ, `మిసిసె కవితా సింగ్ పఠనం, దినకర్జీ యొక్క `పరశురామ్ కి ప్రతీక్ష` వ్యాఖ్యానానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. దాన్ని నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కవితా సింగ్. మీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా గొప్ప సాహిత్య రచనలనుసామన్య ప్రజలలోకి తీసుకురావడంలో మీది గొప్ప సహకారం` అని చెప్పారు పవన్.
మరోవైపు రెండు తెలుగు ప్రజలకు, అభిమానులకు పవన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. `ఆశావహ దృక్పథంతో ప్రవేశిస్తున్న 2021 నూతన వసంతంలో దేశ ప్రజలు, తెలుగు వారందరికీ నా తరపున, జనసేన శ్రేణుల పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020లో మానవాళిని భయకంపితులను చేసిన కరోనా మహమ్మారి ప్రపంచ ప్రగతి రథ చక్రాన్ని సైతం కొన్ని నెలలపాటు నిలువరించింది. కోట్లాది మందిని ఆస్పత్రి పాల్జేసింది. లక్షలాది ప్రాణాలను చిదిమేసింది. దీనికి తోడు ప్రకృతి బీభత్సాలు సైతం వెంటాడాయి. 2020 చివరి రోజుల్లో భారీ వర్షాలు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి, నివర్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ రైతులకు కన్నీరు మిగిల్చింద`న్నారు.
ఇంకా పవన్ చెబుతూ, `కరోనా మహమ్మారిపై శాస్త్ర విజ్ఞానం పై చేయిగా మారింది. వాక్సిన్ రూపంలో కోవిడ్ పీచమణచగల ఆయుధం మన శాస్త్రవేత్తల కృషి ద్వారా ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన సంవత్సరంలో దేశంలోని ప్రతీ ఒక్కరికీ కోవిడ్ టీకా కరోనా నుంచి రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నా. రైతులు, కౌలు రైతులు, వృతి నిపుణులు, ఉద్యోగులు, కార్మికులు, కళాకారులు ఇలా అన్ని వర్గాలు తమ కుటుంబాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని ప్రార్థిస్తున్నా. లోక సమస్తా సుఖినోభవంతు` అని పవన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.