అమితాబ్ కు కరోనా ఎలా సోకిందంటే..!
కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని తాకింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ శనివారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన , ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బిగ్ బి ఆరోగ్యం నిలకడగానే ఉందని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అమితాబ్ కరోనా సంబంధిత తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారన్నారు. ఈ నేపధ్యంలో అసలు అమితాబ్ కు ఎలా కరోనా ఎటాక్ అయ్యిందనే విషయమై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే...మార్చి 23న లాక్ డౌన్ ప్రారంభించిన రోజు నుంచి ఆయన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు వీడియోలు రూపొందించారు. ఇంట్లోనే ఉంటూ చిరంజీవి, మమ్ముట్టి, రజనీకాంత్ తదితరులతో కలిసి ఓ లఘు చిత్రంలో కూడా నటించారు. అటువంటి ఆయన్ను కరోనా వైరస్ ఎలా చేరింది? అంటే... లాక్ డౌన్ సడలింపులు ప్రారంభమైన తరువాత, అమితాబ్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.
తాను హోస్ట్ గా వ్యవహరించాల్సిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' సెలక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తరువాత అమితాబ్ పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే. అక్కడికి వచ్చిన వారిలో ఎవరిలోనో వైరస్ ఉండి వుండవచ్చని, వారి నుంచే అమితాబ్ కు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు? వారిలో ఎవరికి వైరస్ ఉందన్న విషయమై అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిందని తెలియడంతో మొత్తం చిత్ర పరిశ్రమ షాక్ నకు గురైంది. కాగా కరోనావైరస్కు అధికంగా ప్రభావితమైన నగరాల్లో ముంబై ఒకటి. ఈ మహానగరంలో కరోనా కేసుల సంఖ్య 9,1745గా ఉంది. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారని తెలియగానే, బాలీవుడ్ ప్రముఖులు బిగ్ బీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.