త్రిషను అరెస్ట్ చేస్తారా, ఆ ఫొటో అసలు బయటకు ఎలా వచ్చింది?
త్రిష అనేక క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా... ఆమెను అరెస్టు చేయాలని సమాజంలోని కొన్ని వర్గాలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. త్రిష అరెస్ట్ దేనికి?
త్రిష కెరీర్ మొదటనుంచీ తాను వివాదాల్లో ఇరుక్కోవటానికి ఇష్టపడదు.సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. సాధ్యమైనంతవరకూ అలాంటివాటికి దూరంగా ఉందామనే చూస్తుంది. అందుకే ఇంత సుధీర్ఘ కెరీర్ లో ఆమె పర్శనల్ విషయాలపై రచ్చ జరిగిందేమో కానీ వేరే వివాదాలు ఆమెను వరించలేదు. అయితే తాజాగా ఆమె చేసిన పొరపాటు పెద్ద వివాదమై అరెస్ట్ చేయాలనే డిమాండ్ దాకా తీసుకొచ్చింది.ఆమెను అరెస్టు చేయాలని సమాజంలోని కొన్ని వర్గాలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ త్రిష విషయంలో ఏం పొరపాటు జరిగింది? ఆమెని అరెస్టు చేయాలని డిమాండ్ ఊపందుకోవటానికి కారణం ఏమిటో చూద్దాం.
ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న `పొన్నియన్ సెల్వం -1` లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇండోర్ లో ఉన్న పాత దేవాలయంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష- ఐశ్వర్యారాయ్ లపై ఒకేసారి కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో త్రిష చెప్పులు ధరించి ఆలయ ప్రాంగణంలో నడిచింది. ఈ నేపధ్యంలో ఆమె శివలింగం.. నంది మధ్య చెప్పులతో నడుస్తున్న ఫొటో వైరల్ అయింది.
దీంతో హిందు సంఘం నేతలు త్రిషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పని చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు త్రిషపై కేసు నమోదు చేసి.. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి షూటింగ్ స్పాట్లో ఎలాంటి ఫొటోలను తీసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటారు. కానీ ఇప్పటికీ ఈ వివాదాస్పద ఫొటో ఎలా బయిటకు వచ్చిందో కానీ చిత్ర యూనిట్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది.డైరక్షన్ టీమ్ కు తెలియకుండానే ఇది జరిగిందా? పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు త్రిష క్షమాపణలు చెబుతారా? ఏం జరగనుందో వేచి చూడాలి.