డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న తనీష్ విచారణ
- డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన తనీష్
- కొనసాగుతున్న నటుడు తనీష్ విచారణ
- కెల్విన్ ముఠాతో సంబందాలపై ఆరా తీస్తున్న సిట్
టాలీవుడ్ లింకులతో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన డ్రగ్స్ కేసులో సిట్ విచారణ 11వరోజు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన వారిని సిట్ అధికారులు వరుసగా విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వర్థమాన హీరో తనీష్ సిట్ విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం ఆయన తన నివాసం నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు తనీష్పై ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొన్న హీరోలు నవదీప్, తరుణ్ను ఎప్పుడెప్పుడు కలిశారు. ఎలాంటి పార్టీలకు హాజరు అవుతారు. విదేశాల్లో పబ్లకు వెళతారా అంటూ సిట్ అధికారులు తనీష్పై ప్రశ్నలు వర్షం కురిపించారు. అలాగే ఈ కేసులో కెల్విన్, జీశాన్తో గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కెల్విన్ ఫోన్లో తనీష్ నెంబర్ ఉన్నట్లు, వీరిద్దరి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లు సమాచారం. కాగా పదిమంది సినీ ప్రముఖులను సిట్ ప్రశ్నించగా, మంగళవారం హీరో నందూ విచారణకు హాజరు కానున్నారు.