అల్లు అర్జున్ కి తెగ నచ్చేసింది, వరస ట్వీట్స్
చిత్రటీమ్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లేటెస్ట్ చిత్రం 'షేర్షా'కు అభినందనలు తెలిపారు. ఆయన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'షేర్షా' సినిమాను బుధవారం చూసారు. అల్లు అర్జున్కి ఈ సినిమా బాగా నచ్చింది. చిత్రటీమ్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వరుస ట్వీట్లతో సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం 'షేర్షా'. పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా వీరోచిత ప్రస్థానం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన “షేర్షా”ను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. 'షేర్షా' అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాగా, బాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను వీక్షించారు. ఆపై సోషల్ మీడియాలో తన స్పందన వెలిబుచ్చారు.
"షేర్షా చిత్రటీమ్ మొత్తానికి అభినందనలు. హృదయాన్ని కదిలించే చిత్రం ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్ లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సినిమా మొత్తం అతడే ప్రధాన ఆకర్షణ. కియారా అద్వానీ, ఇతర నటీనటులు సైతం ఎంతో ప్రభావవంతంగా నటించారు. ఈ చిత్రకథపై ఎంతో నమ్మకంతో దర్శకుడు విష్ణువర్ధన్ అద్భుతంగా తెరకెక్కించారు. విష్ణువర్ధన్ గారూ... మీరు మమ్మల్ని గర్వించేలా చేశారు. కరణ్ జోహార్ సహా నిర్మాతలందరికీ అభినందనలు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం ఇది. ఇంతటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసుకువచ్చినందుకు అమెజాన్ ప్రైమ్ కు అభినందనలు తెలపాలి" అని పేర్కొన్నారు. ఇంతకముందు విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.