ఐశ్వర్యా రాయ్ కరోనా రిజల్ట్ కన్ఫ్యూజన్, కారణమిదే!
అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ సతీమణి ఐశ్వర్యారాయ్ కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఐశ్వర్యారాయ్ తో పాటు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ అని కంఫర్మ్ అయింది.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.తొలుత చేసిన పరీక్షల్లో ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు నెగటివ్ రాగా, రెండో టెస్టులో వారిరువురికీ కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే టెస్ట్ రిజల్ట్ లో ఆ కన్ఫూజన్ ఎందుకు చోటు చేసుకుందనే విషయమై అంతటా చర్చ జరిగింది.
వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు, ఆపై ఆదివారం ఉదయం ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. అంతకుముందు అమితాబ్ కుటుంబీకులకు పరీక్షల విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఆ పై గంటల వ్యవధిలోనే కన్ఫ్యూజన్ కు అధికారులు తెరదించారు.
ముంబై మేయర్ కిషోర్ ఫడ్నేకర్ అమితాబ్, అభిషేక్ లకు మినహా మిగతా వారందరికీ కరోనా సోకలేదని ప్రకటించగా, ఆపై మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే మాత్రం జయబాధురికి నెగటివ్ వచ్చిందని, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఈ భిన్న ఫలితాల వెనుక ఉన్న కారణాన్ని అధికారులు వెల్లడించారు.
కరోనా టెస్టుల విషయంలో ప్రొటోకాల్ ప్రకారం తొలుత యాంటీజెన్ టెస్టులు చేసిన శాంపిల్ కు పాజిటివ్ వస్తే, అది కచ్చితంగా పాజిటివే. నెగటివ్ వస్తే మాత్రం, సదరు శాంపిల్ ఆర్టీ - పీసీఆర్ టెస్టుకు పంపించి, నెగటివ్ గా నిర్ధారణ అయితేనే సదరు వ్యక్తికి కరోనా సోకలేదన్న విషయాన్ని నిర్దారించాలి. ఆర్టీ-పీసీఆర్ ఫలితమే కరోనా తుది ఫలితం అవుతుంది.
తొలుత అమితాబ్ కుటుంబీకులందరికీ యాంటీజెన్ టెస్టు నిర్వహించగా, అమితాబ్, అభిషేక్ లకు పాజిటివ్ వచ్చింది. మిగతావారికి నెగటివ్ వచ్చింది. అదే విషయాన్ని ముంబై మేయర్ తొలుత వెల్లడించారు. ఆపై ప్రొటోకాల్ ప్రకారం, ఆర్టీ - పీసీఆర్ టెస్ట్ లను నిర్వహించగా, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్ వచ్చింది. ఈ టెస్ట్ ఫలితం రావడానికి 8 గంటల సమయం పడుతుంది. ఈ 8 గంటల వ్యవధిలోనే మీడియాలో వచ్చిన వార్తల కారణంగా అయోమయం ఏర్పడింది.