అడ్డంగా బుక్కయిన పవన్...బంజారాహిల్స్ లో కేసు నమోదు
అడ్డంగా బుక్కయిన పవన్...బంజారాహిల్స్ లో కేసు నమోదు
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రసారం చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలను ట్విటర్లో పెట్టి చానల్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద శుక్రవారం కేసులు నమోదు చేశారు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్, ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
సదరు వీడియోను ఏబీఎన్ చానెల్ ఎడిట్ చేసి ప్రసారం చేసింది. అనుచిత వ్యాఖ్య వద్ద బీప్ శబ్దం ఇచ్చి జాగ్రత్తలు తీసుకుంది. కానీ, తన తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి మాట్లాడితే, ఆమె దూషణలను యథాతథంగా ప్రసారం చేశారని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఏబీఎన్ ఎడిట్ చేసిన వీడియోను మార్ఫింగ్ చేశారు. శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను యథాతథంగా ఉంచి తన ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. అలాగే, ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసి అగౌరవపరిచేలా వ్యవహరించారు. దీనిపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాల నాయకులు రెండు రోజుల కిందటే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరపాలని కోరుతూ ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. వీడియో మార్ఫింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో బంజారాహిల్స్ పోలీసులు పవన్ కల్యాణ్పై కేసులు నమోదు చేశారు.