మీడియా తప్పుడు కథనాలపై బాలీవుడ్ యుద్దం.. హైకోర్ట్ లో సివిల్ సూట్
తమ పరువు తీసినందుకు, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, తప్పుడు రిపోర్ట్, బాధ్యతారహిత్యమైన రిపోర్టింగ్ పేరుతో హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు బాలీవుడ్ని షేక్ చేసింది. ఈ కేసు మూలంగా బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా బయటకు వచ్చింది. ఇందులో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. వారిని నార్కొటిక్ కంట్రోలో బ్యూరో(ఎన్సీబీ) విచారిస్తుంది. మరోవైపు సుశాంత్ కేసుని సీబీఐ విచారిస్తోంది.
అయితే ఈ వ్యవహారంలో బాలీవుడ్పై అనేక నెగటివ్ కథనాలు ప్రచురితమయ్యాయి. అనేక మీడియా సంస్థలు బాలీవుడ్పై అనేక కథనాలు ప్రసారం చేశాయి. దీంతో మండిపోయిన బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాయి. అంతేకాదు తమది `డర్టీ ఇండస్ట్రీ`, `డ్రగ్ ఇండస్ట్రీ`గా చిత్రీకరించడంపై మండిపడ్డారు. ఈ మేరకు నాలుగు బాలీవుడ్ అసోసియేషన్లు, 34 నిర్మాణ సంస్థలు ఢిల్లీ హైకోర్ట్ ని ఆశ్రయించాయి.
తమ పరువు తీసినందుకు, తప్పుడు కథనాలు ప్రసారం చేయడం, తప్పుడు రిపోర్ట్, బాధ్యతారహిత్యమైన రిపోర్టింగ్ పేరుతో హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా రిపబ్లిక్ టీవీ నుంచి అర్నాబ్ గోస్వామి, ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ నుంచి రాహుల్ శివశంకర్, నవిక కుమార్ల, వంటి మరికొన్ని టీవీ, వెబ్ మీడియాలపై సివిల్ సూట్ని దాఖలు చేశారు. దయజేసి తమ గౌరవాన్ని భంగం చేయవద్దని, పరువు తీయవద్దని, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలు హైకోర్ట్ ని విన్నవించాయి.
బాలీవుడ్ని `డర్ట్`, ` ఫిల్గ్`, `స్కమ్`, `డ్రగ్గీస్` వంటి పేర్లతో కథనాలను ప్రచారం చేయడం, బాలీవుడ్ కొకైన్, ఎల్ఎస్డీలతో తడిసిముద్దవుతున్నాయని ప్రచారం చేయడంపై ఆయా ప్రొడక్షన్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కోట్ల మంది ఆదరిస్తున్నారని, వారి ప్రేమ, అభిమానం వల్లే ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. కరోనా వల్ల ఎంతో ఇబ్బంది పడుతుందని, మరోవైపు ఈ వివాదాలు బాలీవుడ్ ప్రతిష్టని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి బాలీవుడ్ దేశంలోనే అనేక విషయాల్లో ఆదర్శంగా ఉందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. దేశానికి ఓ పెద్ద ఆదాయ మార్గంగా ఉందన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ రావడంలో, టూరిజం డెవలప్ కావడంలో బాలీవుడ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇలాంటి అసభ్య పదజాలం, ప్రతిష్ట దెబ్బతీసే కథనాలు తమ ఉపాధి అవకాశాలపై చెడు ప్రభావం చూపుతుందని, బాలీవుడ్పై ఉన్న అభిప్రాయాన్ని మార్చేలా ఉందన్నారు. ఈ సందర్భగా బాధ్యతారహిత్యంగా వార్తలను ప్రచారం చేసి మీడియాలపై పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ సంస్థల్లో ది ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ది సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, యాడ్ ల్యాబ్స్ ఫిల్మ్స్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్, అండోలన్ ఫిల్మ్స్, అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్, బీఎస్కే నెట్వర్క్ అండ్ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గూడ్ ఫిల్మ్స్, క్లీన్ స్లేట్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్, ఎమ్మా ఎంటర్టైన్మెంట్ అండ్ మోషన్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మక్రాఫ్ట్ ప్రొడక్షన్స్, హోప్ ప్రొడక్షన్, కబీర్ కాన్ ఫిల్మ్స్ వంటివి ఉన్నాయి.
వీటితోపాటు లవ్ ఫిల్మ్స్, మక్గుఫిన్ పిక్చర్స్, నడియడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, వన్ ఇండియా స్టోరీస్, ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్, రాకీష్ ఓంప్రాకష్ మెహ్రా పిక్చర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్, రియల్లైఫ్ ప్రొడక్షన్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్, రాయ్ కపూర్ పిక్చర్స్, సల్మాన్ ఖాన్ వెంచర్స్, సోహాలి ఖాన్ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్, టైగర్ బేబీ డిజిటల్, వినోద్ చోప్రా ఫిల్మ్స్, విశాల్ భరద్వాజ్ ఫిల్మ్, యశ్ రాజ్ ఫిల్మ్స్ వంటి సంస్థలున్నాయి. దాదాపు టాప్ ప్రొడక్షన్ హౌజ్లు మొత్తం కలిసి వస్తున్నాయి.
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995లోని సెక్షన్ 5కింద, అలాగే కేబుల్ టెలివిజన్ నెట్వర్స్ రూట్స్ 1994లోని రూల్ 6 కింద ఫిర్యాదు చేశారు. మరి దీనిపై కోర్ట్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువడిస్తుందనేది ఆసక్తి నెలకొంది.