పోలీసులు లేకుండా బయటకు రాగలవా?: చంద్రబాబుకు అవంతి సవాల్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ఆయన విశాఖ పర్యటనలో చెప్పిన మాటలన్ని అబద్దమేనంటూ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన చంద్రబాబు పోలీసులను దూషించడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వారి రక్షణ లేకుండా ఆయన కనీసం ఇంట్లోంచి బయటకు వెళ్లగలరా..? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వయస్సు, అనుభవం పెరుగుతోంది... కానీ స్థాయి పడిపోతోందన్నారు.గత నెల రోజుల నుంచి ఆయన భాష, వ్యవహర శైలి దారుణంగా ఉందన్నారు.బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆ తరహా భాష వాడకూడదని సూచించారు.
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి జగన్ ను గతంలో బయటకే రానివ్వలేదని గుర్తుచేశారు. కానీచంద్రబాబు విశాఖ వచ్చి మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. టిడిపి హయాంలో విశాఖలో భూ కబ్జాలు జరిగాయి... దీనిపై మంత్రులే పరస్పరం ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.
లక్ష ఉద్యోగాలు కల్పించడం రౌడీ రాజ్యమా..? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థకు చంద్రబాబు అనుకులమా..? వ్యతిరేకమా..? ఆటో డ్రైవర్లకు ఆర్ధిక చేయూత ఇవ్వడం రౌడీ రాజ్యమా..? వైఎస్సార్ రైతు భరోసా అమలు చేయబోతుండడం మంచి పని కాదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పరిపాలన చేస్తున్నామని తెలిపారు. ఇల్లు ముంచడానికి కృత్రిమంగా వరద సృష్టించామని... విశాఖ పార్టీ కార్యాలయంలో కరెంట్ తీసేశారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.