Asianet News TeluguAsianet News Telugu

పంత్ భవితవ్యంపై నీలి నీడలు... వాట్ నెక్స్ట్...?

వికెట్ల వెనకాల అవకాశాలు వదిలేసిన ప్రతీసారి అభిమానులు ' ధోని ధోని' అంటూ పంత్‌ను గేలిచేశారు. పంత్‌ను అవమానించొద్దు, సమయం ఇవ్వండి అంటూ కోహ్లి, రోహిత్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌ స్టార్‌గా పిలువబడుతూ జాతీయ జట్టులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ కెరీర్ రెండేండ్ల కాలంలోనే 360 డిగ్రీలు తిరిగింది. 

Rishabh pant's life has gone for a toss....What's next for him?
Author
Hyderabad, First Published Jan 26, 2020, 12:45 PM IST

భారత్ న్యూజిలాండ్ పర్యటనలో దుమ్ము రేపుతోంది. ఆస్ట్రేలియాపై స్వదేశంలో సిరీస్ నెగ్గిన జోరు మీదున్న భారత్ అక్కడ ఇప్పటికే ఒక టి 20 ని కూడా గెలిచేసింది. టీంలో అందరూ కూడా ఎవరిగురించన్నా మాట్లాడుకుంటున్నారంటే అది ఖచ్చితంగా కేఎల్ రాహుల్ గురించే. 

రాహులా చాలా బాగా ఆడుతున్నాడు, ఏ స్థానంలోనయినా బ్యాటింగ్ కి దిగుతూ అదరగొడుతున్నాడు, కీపింగ్ కూడా బాగానే చేస్తుండడంతో అంతా అతని ఆటతీరును గమనిస్తూ భవిషయ్త్తులో భారత జట్టుకు ఒక విలువైన ఆటగాడిగా రూపాంతరం చెందుతున్నాడు అని అంటున్నారు. 

అది నిజమే. అతని ఆటతీరు ఇప్పుడు అలా ఉంది. నేను ఉన్నాను అంటూ ఏ స్థానంలోనయినా జట్టుకు తన సేవలను అందిస్తున్నాడు. రాహుల్ ఆట తీరు వల్ల ఒక ఇద్దరు ఆటగాళ్లు టీంలో ఆడడం లేదు అన్న మాటనే మనం మర్చిపోయాము. 

Also read; రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ఎసరు: గంగూలీ స్పందన ఇదీ...

ఒకరు శిఖర్ ధావన్ కాగా, మరొకరు రిషబ్ పంత్. శిఖర్ అంటే భుజం గాయం కారణంగా ఆడడం లేదు. పంత్ టీంలో ఉన్నప్పటికీ... అతనికి ఆడటానికి ఛాన్స్ దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పంత్ గమనం ఎలా ప్రారంభమయింది? అతని ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు పై కమ్ముకున్న నీలి నీడలు ఏమి గుర్తుకు తెస్తున్నాయి ఒక సారి చూద్దాము. 

22 ఏండ్ల యువ క్రికెటర్‌ రెండేండ్ల అంతర్జాతీయ క్రికెట్‌ ప్రయాణంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చూసేశాడు. 2018 ఇంగ్లాండ్‌-ఏ పర్యటనకు వికెట్‌ కీపర్‌గా కెఎస్‌ భరత్‌కు స్థానం కోల్పోయిన రిషబ్‌ పంత్‌.. వృద్దిమాన్‌ సాహా గాయంతో తర్వాతి టెస్టు సిరీస్‌కు ఏకంగా సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. 

టెస్టు జట్టులో బ్యాకప్‌ కీపర్‌గా ఉన్న పంత్‌. ఇంగ్లాండ్‌లో రెండు టెస్టుల తర్వాత రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ను వెనక్కి నెట్టేశాడు. ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగ్రేటంతో టెస్టు క్రికెటర్‌ అయిపోయాడు. వికెట్‌ కీపర్‌గా పంత్‌ తన రెండు, మూడో టెస్టుల్లో బైస్‌ రూపంలో ఏకంగా 70 పరుగులు సమర్పించాడు. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై బంతికి ఆలస్యంగా లభించే కదిలకలను పంత్‌ పట్టుకోలేకపోయాడు. 

టెస్టు క్రికెటర్‌గా పరుగుల ఖాతాను సిక్సర్‌తో తెరిచిన పంత్‌, జీవం లేని ఓవల్‌ టెస్టులో అద్భుత సెంచరీ సాధించాడు. అరంగ్రేట సిరీస్‌లోనే కెమెరాలకు పంత్‌ ఇష్టమైన ఆటగాడు అయిపోయాడు. 

కీపింగ్‌ పొరపాట్లను మాత్రం పంత్‌ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బైస్‌ అడ్డుకునేందుకు పంత్‌ డైవ్‌ చేసినా ప్రయోజనం ఉండటం లేదు. ఇంత జరుగుతున్నా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపికయ్యాడు. వెళ్లిన పంత్‌ అక్కడా శతకం సాధించాడు. 

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల్లో సెంచరీలు సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌ గా ఘనత దక్కించుకున్నాడు. వికెట్ల వెనకాల ఆసక్తికర మాటల యుద్ధంతో ఆసీస్‌ మీడియాలో ప్రముఖంగా కనిపించాడు. 

ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పెయిన్ భార్యా పిల్లలతో ఫోటో దిగి అతడు క్రీజులో చేసిన బేబీ సిట్టర్‌ కామెంట్‌కు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చాడు. విదేశీ గడ్డపై బ్యాట్‌తో అలరించిన పంత్‌కు స్వదేశంలో మాత్రం చీత్కారం ఎదురైంది. 

Also read: ముందు రాహుల్, వెనక శ్రేయస్.... కోహ్లీకి రిలీఫ్... ప్రపంచకప్ టీంపై భరోసా

వికెట్ల వెనకాల అవకాశాలు వదిలేసిన ప్రతీసారి అభిమానులు ' ధోని ధోని' అంటూ పంత్‌ను గేలిచేశారు. పంత్‌ను అవమానించొద్దు, సమయం ఇవ్వండి అంటూ కోహ్లి, రోహిత్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌ స్టార్‌గా పిలువబడుతూ జాతీయ జట్టులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ కెరీర్ రెండేండ్ల కాలంలోనే 360 డిగ్రీలు తిరిగింది. 

తీపి, చేదు రెండూ అనుభవించాడు. అభిమానులతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ సైతం పంత్‌పై విమర్శలు చేయటం మొదలెట్టింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో పంత్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు. శ్రీలంకపైనా మెప్పించాడు!. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌, న్యూజిలాండ్‌ పర్యటన పంత్‌ కు ఎంతో కీలకం. వీటిలో ప్రదర్శన ఆధారంగానే 2020 టీ20 వరల్డ్‌కప్‌ లో అతగాడి చోటు డిసైడ్ అవనుంది. ఇంతలోనే ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రిషబ్‌ పంత్‌ తల అదిరింది. కంకషన్‌ రిటైర్డ్‌హర్ట్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. 

జట్టులోని మరో వికెట్‌ కీపర్‌ (డొమెస్టిక్ మ్యాచుల్లో కర్ణాటక తరఫున రాహుల్‌ రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌) కెఎల్‌ రాహుల్‌ గ్లౌవ్స్‌ తొడిగాడు. వాంఖడె, రాజ్‌కోట్‌, బెంగళూర్‌ల్లో రాహులే వికెట్‌ కీపింగ్‌ కొనసాగించాడు. 

పంత్‌ గాయంతో బాధ్యతలు తీసుకున్న రాహుల్‌.. పంత్‌ తిరిగొచ్చినా వికెట్ల వెనకాలే కొనసాగుతున్నాడు. దీంతో జట్టులో రిషబ్‌ పంత్‌ పరిస్థితిపై చర్చ మళ్లీ మొదటికొచ్చింది. కెఎల్‌ రాహల్‌ గతంలో రాహుల్‌ ద్రవిడ్‌ పోషించిన పాత్ర పోషిస్తున్నాడు. 

రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోవటంతో అదనంగా మరో బ్యాట్స్‌మన్‌కు తుది జట్టులో చోటు లభిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్‌ వాదన. బ్యాట్స్‌మన్‌గా గత ఆరు నెలలుగా సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్న కెఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌గానూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. 

భారత్‌కు రాహుల్‌ దీర్ఘకాలిక ఆప్షన్‌ అవునో కాదో ఇప్పుడే చెప్పలేం. బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌గా ఒత్తిడిని రాహుల్‌ శరీరం తట్టుకోగలదా? లేదా అనే కోణంలోనూ జట్టు మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోందనే వాదన వినిపిస్తోంది. 

Also read; నేను దాన్ని ప్రేమిస్తున్నా, ఆనందిస్తున్నా: కేఎల్ రాహుల్

రెండు బాధ్యతల్లోనూ రాహుల్‌ జోరు కొనసాగితే మరో వాదనకు తావులేకుండా 2020 టీ20 వరల్డ్‌కప్‌లోనూ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నం.4 స్థానంలో భారత్‌ను గెలిపించే బాధ్యతను రిషబ్‌ పంత్‌కు అప్పగించిన విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రి ద్వయం.. ఇప్పుడు అదనపు బ్యాట్స్‌మన్‌గా రిషబ్‌ పంత్‌ను ఎందుకు చూడటం లేదో అర్థం కాని వ్యవహారం. 

కుర్ర క్రికెటర్‌గా విపరీత ఒత్తిడిని అనుభవిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఇప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌లో భరోసా అత్యవసరం. తుది జట్టులో నిలిచినా, బెంచ్‌కు పరిమితమైనా కుర్ర క్రికెటర్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా చూడాల్సిన గురుతర బాధ్యత చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రిపై ఉంది. విపరీత చర్చకు దారితీస్తోన్న రిషబ్‌ పంత్‌ అంశం చివరకు ఎటు వెళ్తోందనేది ఆసక్తికరంగా మారింది. 

ఏది ఏమైనా కుర్ర పంత్ కు మాత్రం జట్టు చేదోడు వాదోడుగా ఉంటూ... అతనితో సాధ్యమయినన్ని దేశవాళీ టోర్నీలు ఆడించాలి. పంత్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున మరో సారి జూలు విధించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios