స్నిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా వీడ్కోలు: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై
భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ కేరీర్ కు వీడ్కోలు పలికాడు. తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ఓజా ప్రకటించాడు. తన జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభిస్తానని చెప్పాడు.
హైదరాబాద్: భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. తక్షణమే తాను దాన్ని అమలులో పెడుతున్నట్లు కూడా చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. తనకు మద్దతు ఇచ్చినవారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ట్విట్టర్ లో థ్యాంక్యూ నోట్ కూడా పెట్టాడు. జీవితంలో తదుపరి అధ్యాయం మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం అనుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.
ఓజా 2009లో శ్రీలంకపై జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఆయన 24 మ్యాచుల్లో 113 వికెట్లు తీసుకున్నాడు. 33 ఏళ్ల ఓజా భారత్ తరఫున 18 అంతర్జాతీయ వన్డేలు, 6 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడాడు.
వన్డేల్లో ఓజా 21 వికెట్లు తీసుకోగా, టీ20ల్లో 10 వికెట్లు తీసుకన్నాడు. ఒడిశాలో పుట్టిన ప్రజ్ఞాన్ ఓజా2013లో వెస్టిండీస్ పై జరిగిన మ్యాచులో చివరిసారిగా ఆడాడు. అది 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ మ్యాచ్.
ఇక కుమారుడు యోహాన్ కు జీవితానికి సంబంధించిన పాఠాలు చెప్పడం తన లక్ష్యమని ఓజా అన్నాడు.