Virat Kohli: విరాట్ కూతురును రేప్ చేస్తాం: సోషల్ మీడియాలో దుండగుల బెదిరింపులు.. తీవ్రంగా ఖండించిన క్రీడాలోకం
T20 World cup: పాకిస్థాన్ తో మ్యాచ్ అనంతరం.. పలువురు దుండగులు షమీ మతాన్ని అడ్డుపెట్టి కొన్ని విపరీత వ్యాఖ్యలకు దిగారు. రెండ్రోజుల క్రితం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ షమీకి మద్దతు తెలిపాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారిని అతడు వెన్నెముకలేనివాళ్లు గా అభివర్ణించాడు. ఇదే ఇప్పుడు కోహ్లీ పాలిట శాపమైంది.
టీ20 ప్రపంచకప్ (T20 World cup) లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన టీమిండియా (Team India) ఇప్పటికే ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. అసలు కనీస పోరాటం లేకుండా ప్రత్యర్థులకు తలవంచడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. టీ20 ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ (Pakistan) చేతిలో భారత్ దారుణ పరాయజం తర్వాత.. పలువురు మహ్మద్ షమీ (Mohammad Shami)ని టార్గెట్ చేయగా ఇప్పుడు భారత సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) బాధితుడిగా మారాడు. విరాట్ కోహ్లి.. అతడి సతీమణి అనుష్క (anushka Sharma)ల గారాల పట్టి.. నిండా ఏడాది కూడా నిండని వామిక (Vamika)కు రేప్ బెదిరింపులు వచ్చాయి.
పాకిస్థాన్ తో మ్యాచ్ అనంతరం.. పలువురు దుండగులు షమీ మతాన్ని అడ్డుపెట్టి కొన్ని విపరీత వ్యాఖ్యలకు దిగారు. షమీ ముస్లిం కావడం వల్ల అతడు పాక్ గెలవాలని కోరుకున్నాడని, దగ్గరుండి పాకిస్థాన్ ను గెలిపించాడని పిచ్చికూతలు కూశారు. అయితే దీనిపై క్రీడాలోకం భగ్గుమంది. షమీ అంకితభావాన్ని ప్రశ్నించాల్సిన పన్లేదని అతడికి మద్దతుగా నిలిచింది. రెండ్రోజుల క్రితం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా షమీకి మద్దతు తెలిపాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నవారిని అతడు వెన్నెముకలేనివాళ్లు గా అభివర్ణించాడు. ఇదే ఇప్పుడు కోహ్లీకి శాపమైంది.
షమీకి మద్దతుగా నిలిచినందుకు గాను దుండగులు ఈసారి కోహ్లీని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో కోహ్లిని టార్గెట్ చేస్తూ.. వామికను రేప్ చేస్తామని హెచ్చరించారు. ఆ చిన్నారి (వామిక) ఫోటోల కోసం ఎదురుచూస్తున్నామని, అవి బయటకు రాగానే ఆమెను రేప్ చేస్తామని కోహ్లి, అనుష్కలను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.
కాగా, దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వికృత చర్యలకు పాల్పడేవాళ్లను జైళ్లో పడవేయాలని కోరుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమని, రెండు మ్యాచ్ లు ఓడినంత మాత్రానా క్రికెటర్లను, వారి కుటుంబాలను ఇలా టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు క్రీడా లోకం కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. మునుపెన్నడూ లేని విధంగా ఆటగాళ్ల కుటుంబాలను, మతాన్ని టార్గెట్ చేయడం సిగ్గుచేటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే విషయమై ఆశ్చర్యకరంగా కోహ్లికి పాకిస్థాన్ నుంచి కూడా మద్దతు లభిస్తున్నది. ఆ జట్టుకు చెందిన మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam ul haq), మహ్మద్ అమీర్ (Mohammad amir) లు ఈ వివాదంపై స్పందించారు. ఇంజమామ్.. తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘విరాట్ కూతురుకు బెదిరింపులు వస్తున్నాయని తెలిసింది.. సోదరులారా.. ఇది ఒక ఆట. మేమంతా ఆటగాళ్లం. అది ఇండియా కావచ్చు. పాకిస్థాన్ కావచ్చు. మేమందరం ఒకే కమ్యూనిటీ (క్రీడాకారులు)కి చెందినవాళ్లం. మేమంతా ఒక కుటుంబం. ఒకవేళ మీకు కోహ్లి ఆట నచ్చకుంటేనో, అతడి సారథ్యం నచ్చకుంటేనో అతడిని ఏమైనా ప్రశ్నించండి. కానీ అతడి కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
విరాట్ కు మద్ధతుగా పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్ స్పందిస్తూ.. ‘ఇప్పటికీ ఇండియా బెస్ట్ టీమ్. కానీ ఇప్పుడు పరిస్థితులు వాళ్లకు అనుకూలంగా లేవు. ఈ కారణంగా ఆటగాళ్ల కుటుంబాలను టార్గెట్ చేయడం, వారిపై మానసికంగా దాడులు చేయడం మంచి పద్ధతి కాదు.
ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది క్రికెట్ లో ఒక ఆట మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశాడు.