Asianet News TeluguAsianet News Telugu

కరోనా కాటుకి కొలువుల్లో కోత... లాక్‌డౌన్ తరువాత 52% శాతం ఉద్యోగులు ఇళ్లకే...

కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా.. ఎవ్వరి నోట విన్నా.. ఈ మహమ్మారిభయమే. దీనివల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం అవుతున్నది. యావత్‌ ప్రపంచాన్ని తన గుప్పిట బంధించిన కొవిడ్‌-19 దెబ్బకు భవిష్యత్‌ కలలు కల్లలయ్యాయి. లాక్ డౌన్ దెబ్బకు స్తంభించిన పరిశ్రమ ఉత్పత్తికి విరామం ఇవ్వడంతో ఆదయం పడిపోయింది.. ఈ క్రమంలో సంస్థలు వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టాయి. ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొలువుల కోతలే దిక్కని 52 శాతం సంస్థలు భావిస్తున్నాయని సీఐఐ సర్వేలో వివిధ సంస్థల సీఈఓలు తేల్చి చెప్పారు. 
 

52% ceo says covid-19, lockdown will result in jobless: CII survey
Author
Hyderabad, First Published Apr 6, 2020, 12:17 PM IST

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా అన్ని రకాల మనుషుల ఉసురు తీస్తున్నది. వీలైతే ప్రాణాలను.. కాకుంటే ప్రాణాలను కాపాడే కొలువులను మింగేస్తున్నది. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సంతో జన నష్టంతోపాటు భారీ స్థాయిలో ఆర్థిక నష్టమూ  వాటిల్లుతున్నది. 

ముఖ్యంగా భారత్‌కు కరోనా సెగ గట్టిగానే తగులుతున్నది. అసలే ఆర్థిక మందగమనంతో అల్లాడిపోతున్న దేశ ఆర్థికవ్యవస్థను ఈ మహమ్మారి ఏకంగా మాంద్యంలోకి పడేసింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌.. ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నా.. అన్ని రంగాలను నష్టాల ఊబిలోకి నెట్టింది.

దీంతో వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్న సంస్థలు భారీ ఎత్తున అంటే 52 శాతం ఉద్యోగాలను ఎత్తివేయాలనుకుంటున్నాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం (సీఐఐ) నిర్వహించిన సీఈవోల సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన సంస్థల్లోని సుమారు 200 మంది సీఈవోలు పాల్గొన్నారు. ఇందులో 52 శాతం మంది లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు. 

గతేడాది డిసెంబర్‌లో చైనాలో కరోనా వైరస్‌ పురుడు పోసుకున్న దగ్గర్నుంచి ప్రపంచానికి యమగండం మొదలైంది. చైనా కష్టాలు నెమ్మదిగా మిగతా దేశాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత వైరస్‌ వ్యాపిస్తూ వచ్చింది. దీంతో ఈ ఏడాది మొదలు అన్ని దేశాల్లో కరోనా భయం కనిపించింది. 

ముఖ్యంగా చైనా లాక్‌డౌన్‌ దేశీయ ఉత్పాదక రంగాన్ని పెద్ద దెబ్బే కొట్టింది. ఇప్పుడు మన దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ తయారీ రంగ కొన ఊపిరినీ కొండెక్కించేస్తున్నది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆదాయం, లాభాలు భారీగా పడిపోవచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని మెజారిటీ సీఈవోలు అంటున్నారు. గత నెల ద్వితీయార్ధం నుంచి మొదలైన లాక్‌డౌన్‌.. ఈ నెల ప్రథమార్ధం వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలూ మూతబడ్డాయి. 

అయితే కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్తంభించిన వ్యాపార కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా టైం పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం అన్ని రంగాలకు కరోనా సెగ  తగులుతున్నది. దీంతో లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు మొత్తంగా వ్యయ నియంత్రణ చర్యలు ఉంటాయని తాజా సర్వేలో మెజారిటీ సీఈవోలు సంకేతాలిచ్చారు. 47 శాతం సీఈవోలు.. ఉద్యోగాల్ని కోల్పోయేవారు 15 శాతం దిగువనే ఉండొచ్చనగా, 32 శాతం సీఈవోలు మాత్రం 15-30 శాతంగా ఉండొచ్చని చెప్తున్నారు. 

స్థూలంగా దాదాపు 52 శాతం సంస్థలు లాక్‌డౌన్‌ తర్వాత ఉద్యోగాల తీసివేతలు ఉంటాయని చెప్పేస్తున్నట్లు సీఐఐ తెలిపింది. దీంతో జీడీపీ చాలావరకు తగ్గిపోవచ్చని హెచ్చరించింది. 

నిరుద్యోగం పెరిగితే మార్కెట్‌లో డిమాండ్‌ పడకేస్తుందని, ఫలితంగా ఉత్పత్తి కుదేలై మొత్తం ఆర్థికవ్యవస్థ ఉనికికే ముప్పు ఏర్పడుతుందని సీఐఐ పేర్కొన్నది. దీంతో రాబోయే ఉద్యోగ కోతల్ని తేలిగ్గా తీసుకోలేమని వ్యాఖ్యానించింది. 

కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ఉదారంగా ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ కోరారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ సైతం నిపుణుల సలహాలతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios