Asianet News TeluguAsianet News Telugu

లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌: 67% మంది జాబ్స్ హుష్‌కాకి.. తాజా సర్వే..

కరోనా లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా 67 శాతం మంది ఉపాధి కోల్పోయారని అజీం ప్రేమ్ జీ వర్సిటీ తాజా సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని పది మందిలో దాదాపు 8మంది ఉపాధి కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగురు ఉపాధి కోల్పోతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
 

lock down effect: 67% of workers lost jobs  said Survey by Azim Premji University
Author
Hyderabad, First Published May 14, 2020, 11:17 AM IST

న్యూఢిల్లీ‌: కరోనా మహమ్మారి పోరులో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. లాక్‌డౌన్‌ వల్ల వ్యవస్థలన్నీ స్తంభించాయి. దీంతో ప్రజల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సమయంలో దాదాపు 67శాతం మంది ఉపాధి కోల్పోయినట్లు తాజా సర్వే వెల్లడించింది. కొందరికి పని లభిస్తున్నా వారిలో 63శాతం మంది తమ ఆదాయాన్ని కోల్పోతున్నారని పేర్కొంది. 

ప్రజల జీవనంపై లాక్‌డౌన్‌ ప్రభావం ఏవిధంగా ఉందన్న విషయంపై అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ఎంప్లాయిమెంట్‌ (సీఎస్‌ఈ) విభాగం నిర్వహించిన సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 74శాతం మంది ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తేలింది. 

గతంలో కంటే తక్కువ ఆహారాన్ని తింటున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ చెప్పడం తాజా పరిస్థితికి అద్ధం పడుతోంది. వీరిలో 80శాతం పట్టణ వాసులు, 70 శాతం మంది గ్రామీణులు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని సర్వే స్పష్టం చేసింది. 

కనీసం వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు కొనడానికి తమ దగ్గర డబ్బు లేదని సర్వేలో పాల్గొన్న 49శాతం మంది వెల్లడించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని పది మందిలో దాదాపు 8మంది ఉపాధి కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుగురు ఉపాధి కోల్పోతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

ముఖ్యంగా పట్టణాల్లోని స్వయం ఉపాధి కార్మికుల్లో దాదాపు 84శాతం మంది ఉపాధి కోల్పోయారు. కాగా 76శాతం మంది నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, 81శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు కూడా వారి ఉపాధి కోల్పోయినట్లు సర్వే పేర్కొంది. 

వ్యవసాయేతర స్వయంఉపాధి పొందుతున్న వారిలో దాదాపు 90శాతం మంది సరాసరి వారం ఆదాయం రూ.2240 నుంచి రూ.218కి పడిపోయినట్లు సర్వే తెలిపింది. తాత్కాలిక ఉద్యోగుల్లో ఫిబ్రవరిలో రూ.940గా ఉన్న వారం ఆదాయం లాక్‌డౌన్‌ సమయంలో రూ.495కి తగ్గిందని స్పష్టంచేసింది. 

also read లాక్ డౌన్ ఎఫెక్ట్: నో ఈఎంఐ.. నో డౌన్ పేమెంట్..ఆఫర్లకూ స్వస్తి

ఇక నెలవారి జీతం తీసుకునే కార్మికుల్లో దాదాపు 51శాతం మంది జీతాల్లో కోత ఉండగా మరికొందరికి జీతమే రాలేదని సర్వే పేర్కొంది. 86శాతం మంది ప్రభుత్వం అందించిన రేషన్‌ సరుకులను పొందడమే తమకు ఊరటనిచ్చిందని వెల్లడించారు. కొందరు కేంద్రం ఇచ్చిన డబ్బులు పొందగా.. జన్‌ధన్ ఖాతా లేని కారణంగా మరికొందరికి డబ్బు అందలేదని తెలిపారు.

ఏప్రిల్‌ 13 నుంచి మే9 వరకు జరిపిన ఈ సర్వేలో 12రాష్ట్రాల్లోని దాదాపు 4వేల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులే ప్రధానంగా ఈ సర్వే చేశారు. ముఖ్యంగా నెలకు 10వేల కంటే తక్కువ సంపాదన కల వారు ఈ సర్వేలో పాల్గొన్నారు. 

స్థానిక ప్రజా సంఘాల సహకారంతో సమాజంలోని అట్టడుగు వర్గాల అభిప్రాయాలను ఈ సర్వేలో పొందుపరిచినట్లు నిర్వహకులు వెల్లడించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు వారి ఉపాధి, కుటుంబంపై ప్రభావం, ప్రభుత్వ సహకారం వంటి అంశాలతో ఈ సర్వే నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో పది రాష్ట్రాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

సీఎంఐఈ సర్వేలో 12కోట్ల ఉద్యోగాలు మాయం..!
కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నెలలోనే దాదాపు 12కోట్ల ఉద్యోగాలు పోయినట్లు సెంటర్‌ ఫర్ మానిటరింగ్ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా మే మొదటి వారానికి దేశంలో నిరుద్యోగిత రేటు 27.1శాతానికి చేరిందని అంచనా వేసింది. 
ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలపై లాక్‌డౌన్‌ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు సీఎంఐఈ పేర్కొన్నది.

సమాజంలోని అట్టడుగు వర్గాలపై దీని ప్రభావం కొనసాగుతుందని స్పష్టం చేసింది. తాజా పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా కొత్త నిబంధనలతో లాక్‌డౌన్‌ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios