Asianet News TeluguAsianet News Telugu

ఇదే మంచి తరుణం: చైనాలోని అమెరికా కంపెనీలను ఆకర్షించేందుకు మోదీ చర్యలు...

కరోనా మహమ్మారి వల్ల అమెరికా, ఐరోపా దేశాలకు తలెత్తిన అనుమానాలను సొమ్ము చేసుకునేందుకు నరేంద్రమోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. సరఫరా చైన్ పునర్నిర్మాణం కోసం చైనా నుంచి బయటకు రావాలని భావించే వెయ్యికి పైగా అమెరికా కంపెనీలను భారత్ లోకి ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ చర్యలు చేపట్టారు. అందుకోసం ఆయా కంపెనీల యాజమాన్యాలతోనూ సంప్రదింపులు జరిపారు. 

India Looks to Lure More Than 1,000 U.S. Companies Out of China
Author
Hyderabad, First Published May 8, 2020, 10:52 AM IST

న్యూఢిల్లీ: సంక్షోభ సమయంలో సృజనాత్మకత ప్రదర్శించిన వారికి సత్ఫలితాలు వస్తాయి. తలపండిన వ్యాపారవేత్తలు ఎన్నాళ్లుగానో చెబుతున్నసారం ఇది. విపత్తుల్లో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉన్నా సరికొత్త స్టార్టప్‌లు మొలిచే సమయమిదేనని వారు భావిస్తారు. 

తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఖర్చుల్లేకుండా భారీ లాభాలు ఆర్జించే పరిశ్రమలకు బీజం పడేది ఇప్పుడేనని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అంటూ ఉంటారు.  ప్రస్తుతం కరోనా కల్పించిన సంక్షోభమూ భారతదేశం ముందు అలాంటి సదవకాశాన్నే ఉంచింది. మరి భారత్‌ దాన్ని అంది పుచ్చుకుంటుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. 

చైనాలోని వుహాన్‌లో గతేడాది చివర్లో పురుడు పోసుకున్న కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ చిధ్రం అయ్యాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోతున్నారు. వైరస్‌ను కట్టడి చేయడం, మహమ్మారి సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోవడంలో చైనా విఫలమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆ దేశంపై తీవ్ర స్థాయిలో విరుచుపడుతూ కటువుగా నిందిస్తున్నారు.

వాణిజ్య యుద్ధ సమయంలోనే ఆ దేశం నుంచి కొన్ని కంపెనీలు వియత్నాంకు వెళ్లిపోయాయి. వైరస్‌ విషయంలో పలు దేశాలకు చైనాపై అనుమానిలు పెరగడంతో దానిపై అతిగా ఆధారపడొద్దని నిర్ణయానికి వచ్చేశాయి. సప్లయ్ చైన్‌లో వైవిధ్యానికి పెద్దపీట వేయాలని ఆయా దేశాల కంపెనీలు భావిస్తుండడం భారత్‌కు వరంగా మారనుంది!

ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ చైనా. పలు దేశాల మదుపర్లు అక్కడ ఎన్నో తయారీ కర్మాగారాలను స్థాపించారు. తేలిగ్గా భూమి లభించడం, సులువైన కార్మిక చట్టాలు, వేతనాల భారమూ తక్కువే కావడం ఆ దేశానికి కలిసొచ్చింది. ఇక నిపుణుల వేతనాలు ఎక్కువేం కాదు. చట్టాల్లో సంస్కరణలు అమలు చేశాకే ఆ దేశం అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.

వైరస్‌ దెబ్బకు ఇప్పుడు పలు దేశాలు, సంస్థలు డ్రాగన్‌పై అతిగా ఆధారపడొద్దని భావిస్తున్నాయి. అక్కడి నుంచి వ్యాపారాలను తరలించేందుకు జపాన్‌ ఇప్పటికే 2.2 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. 

also read మధ్యతరగతి వారికోసం ఎల్‌ఐ‌సి కొత్త పాలసీ..టాక్స్ లేకుండా రూ.23 లక్షలు!

భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లోకి తరలించి సప్లయి చైన్‌లో  వైవిధ్యం పెంచాలని చైనాలోని పలు కంపెనీల అభిప్రాయం ఐరోపా కూటమి దేశాల ఆలోచన సైతం ఇదే. అమెరికా-చైనా మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పులా మారడంతో అమెరికన్ పెట్టుబడిదారులూ మార్పు కోరుకుంటున్నారు.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయింది. ఇప్పుడు మాత్రం వదులుకొనే ప్రసక్తే లేదు. చైనా నుంచి తరలించాలని భావిస్తున్న అమెరికా కంపెనీలను ఆకర్షించే పనిలో నిమగ్నమైంది.

అబ్బోట్‌ లేబొరేటరీస్‌ సహా ఎన్నో సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్నింటికి భారత్‌లో వ్యాపార ఉనికీ ఉంది. ఏప్రిల్‌ నెలలో వెయ్యికి పైగా అమెరికా కంపెనీల యాజమాన్యాలను దౌత్య అధికారుల ద్వారా భారత్‌ సంప్రదించింది. చైనానుంచి తరలించే తయారీ కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలు, మినహాయింపులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. 

పన్నులు, కార్మిక చట్టాలు, భూసేకరణ నిబంధనల్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొందని సమాచారం. వైద్య పరికరాలు, ముడి ఔషధాలు, ఆహార ప్రాసెస్‌ యూనిట్లు, టెక్స్‌టైల్స్‌, తోలు, వాహన విడిభాగల తయారీ సహా 550+ ఉత్పత్తుల తయారీదారులతో చర్చించిందని విశ్వసనీయ సమాచారం.

అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాల్లో తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ఖర్చుతో కూడుకున్న పని. అదే భారత్‌లో తక్కువ వేతనాలకే నిపుణులు, కార్మికులు దొరుకుతారు. చైనాతో పోలిస్తే ఖర్చు కొద్దిగా ఎక్కువైనా మిగతా దేశాలకన్నా తక్కువేనని వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చట్టాలను సులభతరం చేయడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటున్నాయి. 

ఈ-కామర్స్‌ సంస్థల కోరిక మేరకు డిజిటల్‌ లావాదేవీలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను వాయిదాకు అంగీకరించిందట. ట్రంప్‌ కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతికి అనుమతిచ్చిన ప్రభుత్వం రూ.130 బిలియన్‌ పెట్టుబడులను ఆమోదించింది.

జీడీపీలో 15%గా ఉన్న తయారీ రంగ వాటాను 2022 నాటికి 25 శాతానికి పెంచేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని తెలిసింది.ఇందుకోసం చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలతో చర్చించారు. దాదాపు 4 లక్షల హెక్టార్ల భూమిని సిద్ధం చేసింది.


చైనాపై ఆధారపడకుండా సప్లయి చైన్ పునర్‌ నిర్మించేందుకు భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా, వియత్నాంతో చర్చిస్తున్నట్టు అమెరికా మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. ఇందులో భారత్‌, వియత్నాంకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాండ్‌ కార్పొరేషన్‌ పరిశోధకుడు డెరెక్‌ గ్రాస్‌మన్‌ అన్నారు.

సంస్కరణలు చేపడితే మరిన్ని అనుకూలతలు ఏర్పడతాయని రాండ్‌ కార్పొరేషన్‌ పరిశోధకుడు డెరెక్‌ గ్రాస్‌మన్‌ పేర్కొన్నారు. ఇప్పటికీ చైనాలో ఖర్చులు తక్కువైనా అన్ని గుడ్లను ఒకే బుట్టలో వేయొద్దన్న సామాన్య నీతిని కంపెనీలు పాటించాలని భావిస్తున్నాయి. వెంటనే మోదీ ప్రభుత్వం స్పందించడం మొదలుపెట్టిందని  విశ్లేషకులు అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios