Asianet News TeluguAsianet News Telugu

స్వల్ప ఎగుమతులు మినహా ఏప్రిల్‌లో వెహికల్ సేల్స్ ‘సున్నా’

కరోనా ‘లాక్ డౌన్’తో దేశీయంగా ఏప్రిల్ నెలలో అన్ని ఆటోమొబైల్‌ సంస్థలు ఒక్క వాహనం కూడా విక్రయించలేకపోయాయి. పూర్తిగా విక్రయాలు లేకపోవడం చరిత్రలో మొదటిసారి అని తెలుస్తున్నది. కాకపోతే ఎగుమతి విభాగంలో మాత్రం స్వల్ప ఆశావహ ధోరణి కనిపించింది.

Automakers in India Report Zero Sales in April 2020 Due to COVID-19 Lockdown
Author
Hyderabad, First Published May 2, 2020, 11:14 AM IST

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆటోమొబైల్‌ పరిశ్రమ కుదేలైంది. చరిత్రలో మొదటిసారి.. ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో కార్లు, వాణిజ్య, టూ వీలర్ సంస్థలు ఒక్క వాహనం కూడా విక్రయించలేక పోయాయి. కాకపోతే కొన్ని వాహనాలు మాత్రం ఎగుమతి చేయగలిగాయి.

కార్ల మార్కెట్లో దిగ్గజ సంస్థలు మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ), హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) వాహనాన్ని కూడా ఏప్రిల్‌లో విక్రయించలేదని ప్రకటించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తితోపాటు, విక్రయాలకు బ్రేక్‌ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దేశీయంగా ఒక నెలలో విక్రయాలు జరుపకపోవడం మారుతి సుజుకి ఇండియా చరిత్రలోనూ ఇదే తొలిసారి.

అదే విధంగా ఎంజీ మోటార్‌ ఇండియా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం), ద్విచక్ర వాహన కంపెనీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (ఐచర్‌ మోటార్స్‌ అనుబంధ సంస్థ) సైతం దేశీయంగా విక్రయాలు జీరోగానే ఉన్నాయని ప్రకటించాయి. ఇక మహీంద్రా అండ్‌ మహీంద్రా సైతం కార్లు, వాణిజ్య వాహన విభాగంలో దేశీయంగా ఒక్క యూనిట్‌ విక్రయాన్ని కూడా నమోదు చేయలేదు. 

కాకపోతే విదేశీ మార్కెట్లలో ఈ సంస్థలు కొన్ని వాహనాలను విక్రయించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్, ఎంఅండ్‌ఎం, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎగుమతి చేసిన వాటిల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ పరిస్థితులు లేకపోవడం వీటికి కలిసొచ్చింది. మారుతి సుజుకి 632 కార్లు, హ్యుండాయ్ మోటార్స్ 1341, మహీంద్రా అండ్ మహీంద్రా 733 కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ 91 బైక్స్ ఎగుమతి చేశాయి. 

గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించడంతో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ కంపెనీలు ఈ దిశగా సన్నద్ధం అవుతున్నాయి. ఏప్రిల్‌ చివరి వారం లో గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌లో ఎంజీ మోటార్‌ ఇండియా తయారీని ఆరంభించింది. కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు టీకేఎం తెలిపింది.

వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్‌ తక్కువ స్థాయిలో ఉండడం, దెబ్బతిన్న సరఫరా వ్యవస్థను తిరిగి నిర్మించుకోవడం, కార్మికులు తిరిగి పనిలోకి వచ్చి చేరడం వంటి ఎన్నో సవాళ్లను పరిశ్రమ ఎదుర్కొంటున్నదని టీకేఎం సీనియర్ ఉపాధ్యక్షుడు నవీన్ సోనీ చెప్పారు. ఎన్నో ఇతర రంగాల మాదిరే తయారీ, డీలర్‌షిప్‌లను మూసివేయడం వల్ల ఆటోమోటివ్‌ వ్యాల్యూ చైన్‌ పూర్తిగా నిలిచిపోయిందన్నారు. 

తిరిగి కార్యకలాపాల ప్రారంభానికి వీలుగా డీలర్‌ భాగస్వాములతో సన్నిహిత సంప్రదింపులు జరుపుతున్నాం అని నవీన్ సోనీ వెల్లడించారు. సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణంలో డిమాండ్‌కు ప్రేరణనిచ్చేందుకు వీలుగా వారికి తమ పూర్తి మద్దతును అందిస్తున్నామన్నారు. విక్రయాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేశామని, కస్టమర్లు కొనుగోలు చేస్తే ఇంటి వద్దకే వాహనాన్ని డెలివరీ చేసే ఏర్పాటు చేశామని నవీన్ సోనీ వివరించారు. 

కొన్ని రోజుల క్రితమే డీలర్లు పాక్షికంగా కార్యకలాపాలను ప్రారంభించారని సమీప భవిష్యత్తులో పలు సానుకూలతలు కనిపిస్తున్నాయని మహీంద్రా ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం ప్రెసిడెంట్‌ సందీప్‌ సిక్కా తెలిపారు. రబీ ఉత్పత్తి మంచిగా ఉండడం, ప్రభుత్వం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించడం, పంటలకు చక్కని ధరలు ఉంటాయన్న సంకేతాలు వచ్చాయన్నారు.
రిజర్వాయర్లలో నీటి మట్టాలు సాధారణ స్థాయిలో ఉండటం ట్రాక్టర్ల డిమాండ్‌ను పెంచుతాయని మహీంద్రా ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం ప్రెసిడెంట్‌ సందీప్‌ సిక్కా చెప్పారు. కొన్ని వారాల విక్రయాలకు సరిపడా స్టాక్స్‌ ఉన్నాయన్నారు. 

లాక్‌డౌన్‌ సవరణల తర్వాత ఎన్‌బీఎఫ్‌సీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడం, క్షేత్ర స్థాయిలో విక్రయ కార్యకలాపాలపైనే పనితీరు పురోగతి ఆధారపడి ఉంటుందని మహీంద్రా ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం ప్రెసిడెంట్‌ సందీప్‌ సిక్కా వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios