కరోనా రోగుల ఇళ్లకు అరకిలోమీటరు దూరం వరకు రాకపోకలు బంద్: ఏపీ సర్కార్ నిర్ణయం
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాడు ఉదయానికి 266కి చేరుకొన్నాయి. సోమవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీతో పాటు వైద్య,ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ఇళ్లకు అరకిలోమీటరు దూరం వరకు రాకపోకలను నిషేధించారు. కరోనా రోగుల చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరం వరకు ఉన్న ఇళ్లలో కూడ సర్వే నిర్వహిస్తున్నారు.ఈ సర్వే సమయంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు కన్పిస్తే వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి జరిగే ప్రాంతాలను గుర్తించి హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించారు.ఈ ప్రాంతంలో మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Also read:అక్వా రైతుల కోసం పాలకొల్లు నుండి ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే సైకిల్ యాత్ర
హోం క్వారంటైన్ లో ఉన్నవారిపై కూడ నిరంతర నిఘా కొనసాగనుంది. క్వారంటైన్ లో రోగులకు సౌకర్యాలు ఏ రకంగా అందుతున్నాయనే విషయమై కూడ సీఎం జగన్ అధికారులను ఆరా తీశారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారు ప్రజల మధ్యలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇక మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన వారి కారణంగానే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలతో పాటు మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిని జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయనున్నారు.