విశాఖలో కరోనా కలకలం... ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్
విశాఖ జిల్లాలో ఒకేరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
విశాఖపట్నం జిల్లాలో ఇప్పటివరకు 11 కోవిడ్ - 19 కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ వి వినయ్ తెలిపారు. కేవలం ఒక్కరోజే 3 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. ఈ ముగ్గురు విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెంలోని ఒకే కుటుంబానికి చెందినవారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ముగ్గురిని గీతం ఆసుపత్రికి తరలించడం జరిగిందని వివరించారు.
ఇవాళ్టి(శనివారం) నుండి కంటైన్ మెంట్ ఏరియాలో ఆశా, వార్డు వాలంటీర్ తదితర బృందాలు పనిచేస్తాయని తెలిపారు.వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని...వీరు ఉదయం నుండే పనిచేస్తున్నాయన్నారు. సాయంత్రం నాటికి సర్వే పూర్తి చేస్తారని చెప్పారు.
ఎవరిలోనైనా కోవిడ్ - 19 లక్షణాలు కనిపిస్తే వారిని ఆసుపత్రికి పంపడం జరుగుతుందన్నారు. వారి నుండి శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపుతామన్నారు. ఎవరు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.
కంటైన్ మెంట్ ఏరియాలో ఇంటెన్సివ్ శానిటేషన్ ఏర్పాటు చేశామని... అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితని ప్రత్యేక టీంలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాకు వచ్చిన వైరాలజి పరీక్ష కేంద్రం వల్ల అదే రోజు సాయంత్రం నాటికి ఫలితాలు తెలతాయని చెప్పారు.
విశాఖ జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశామని... వీరు సత్వరమే స్పందించి వెళ్లి పరిస్థితిని అంచనా వేసి సీరియస్ నెస్ ని బట్టి అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో సేవలు గురించి ఐఎంఎ తో చర్చించామన్నారు. జిల్లాలో విమ్స్ రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా ఉందని... ఇక్కడ హై ఎండ్ క్రిటికల్ కేర్ చికిత్స అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.