Asianet News TeluguAsianet News Telugu

సమన్వయకర్త.. సంస్కరణల అభిలాషి.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

అనూహ్య పరిణామాల్లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళనాడు కేడర్ ఐఎఎస్ అధికారి శక్తికాంతదాస్ ఏడాది కాలంలోనే అందరి వాడిననిపించుకున్నారు. వరుసగా వడ్డీరేట్లను తగ్గించడంలోనైనా.. ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించడంలోనైనా ఎక్కడా వివాదానికి తావివ్వకుండా ముందుకు సాగారు.  

Shaktikanta Das @1: An eventful year, but questions swirl
Author
Hyderabad, First Published Dec 12, 2019, 1:05 PM IST

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణ సంస్థ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావస్తోంది. గతేడాది డిసెంబర్‌ 12న ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ అర్ధంతరంగా నిష్క్రమించాక అనూహ్యంగా ఆ స్థానంలో దాస్‌ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్‌ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారు. 1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన దాస్‌.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు.

అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్‌ స్టయిల్‌ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలు వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్‌ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్‌ సారథ్యంలో ఆర్‌బీఐ పనితీరును ఒకసారి పరిశీలిద్దాం..

also read కోట్లకు పైగా జీతాలు తిసుకుంటున్న వారు ఎవరో తెలుసా...?

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఐదు విడతల్లో 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించివేసింది. కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది.

Shaktikanta Das @1: An eventful year, but questions swirl

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలనూ మొత్తం మీద 240 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. ఆర్బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్‌ బ్యాంక్‌ బదలాయించింది.  

చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్‌ టైమ్‌ రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటునూ ఆర్బీఐ కల్పించింది. సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌) బైటికి తెచ్చింది.  

also read సామాన్యులపై ధరల భారం...రెవెన్యూ పెంపు కోసం జీఎస్టీలో భారీ మార్పులు..?

సంస్కరణలపరంగా ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా బ్యాంకులు రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ విధానానికి మళ్లేలా శక్తికాంత దాస్‌ కృషి చేశారు. రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్‌ వసతిని 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్‌ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్‌బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు’ అని తెలిపారు. 

‘నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్‌. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు’ అని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు సభ్యుడు సచిన్‌ చతుర్వేది వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios