భారత్కు చేరిన 1,160 టన్నులు ఉల్లి.. అయిన తగ్గని ధరలు
కేంద్రం చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఇంకా ఉల్లి ధరల ఘాటు తగ్గడం లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో ఇంకా ఉల్లి కష్టాలు తీరినట్లు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150గా ఉన్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. దేశంలో లభ్యత పెంచి, ధరలను నియంత్రించడానికి విదేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది ప్రభుత్వం. అయినా ఇంకా చాలా ప్రాంతాల్లో ధరలు అదుపులోకి రాకపోవడం గమనార్హం. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. మెట్రో నగరాలైన కోల్కతాలో కిలో ఉల్లి రూ.120, ఢిల్లీ, ముంబైలలో రూ.102, చెన్నైలో రూ.80గా ఉన్నట్లు తేలింది.
‘దిగుమతి చేసుకుంటున్న ఉల్లి దేశానికి చేరుకుంటుంది. ఇప్పటికే 1,160 టన్నులు భారత్కు చేరింది. ఇంకా 10,560 టన్నుల ఉల్లి వచ్చేనెల 3-4 తేదీల్లో వచ్చే అవకాశముంది. పసుపు, ఎరుపు ఉల్లిగడ్డలను టర్కీ, ఈజిప్టు, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముంబై నౌకాశ్రయానికి ఈ దిగుమతులు చేరుకుంటాయి’ అని ఓ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.
కేంద్రం తరఫున ప్రభుత్వ రంగ మెటల్స్, మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) 49వేల టన్నుల ఉల్లి దిగుమతికి ఒప్పందాలు కుదుర్చుకున్నది. అందులో కొంత మొత్తం వచ్చే నెలలో భారత్కు చేరే అవకాశం ఉంటుంది.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి...ఎంత పెరిగిందంటే..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఉల్లి పంట గతేడాది కన్నా.. 25 శాతం తగ్గింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడంతోపాటు ఆ తర్వాత ఉల్లి అధికంగా పండే రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడటంతో ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రభుత్వం కొన్ని చర్యలకు ఉపక్రమించింది.
ముఖ్యంగా విదేశాలకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయడం.. దళారుల వద్ద నిల్వలపై పరిమితులు విధించడం వంటి నిర్ణయాలు కేంద్రం తీసుకుంది. అయితే ఉల్లి ధరలు వచ్చే ఏడాది జనవరి వరకు.. ఎక్కువగానే ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఉల్లి తరువాత, ఇప్పుడు వంట నూనె ధరలకు రెక్కలు...
ఖరీఫ్ పంట మార్కెట్లోకి వస్తే ధరలు సాధారణ స్థాయికి రావచ్చని అంటున్నారు. గతంలో చూస్తే.. ధరలు భారీగా పెరగటంతో 2015-16లో కేంద్రం 1,987 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నది.