Asianet News TeluguAsianet News Telugu

మందగమనం.. నిరుద్యోగం వెరసి ఉద్యోగాలు కుదిస్తున్న కార్పొరేట్లు

దేశీయంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం ఫలితంగా పలు స్టార్టప్‌ కంపెనీలు మూతపడుతున్నాయి

Corporate Companies Giving Pink Slips
Author
Hyderabad, First Published Jan 19, 2020, 11:41 AM IST


న్యూఢిల్లీ: దేశీయంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం ఫలితంగా పలు స్టార్టప్‌ కంపెనీలు మూతపడుతున్నాయి. మరోవైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. వాటిల్లో ‘శ్యామ్‌సంగ్‌ ఇండియా’ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీ మొదలు ‘పేటీఎం’ లాంటి డిజటల్‌ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ‘ఓయో’ వరకు ప్రతి సంస్థ ఉద్యోగులను కుదించుకోవడం గమనార్హం. 

గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ ఇండియా గుర్గావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌ వారని వార్తలొచ్చాయి.

Also read:స్మాల్ సేవింగ్స్‌పై కేంద్రమంత్రి నజర్... 2.5 లక్షల వరకు రాయితీ...!

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ ‘శ్యామ్‌సంగ్‌ ఇండియా’ ఇటీవల పలు విభాగాల్లో కలిపేసి 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు సమాచారం. యాజమాన్యం ఒత్తిడికి తగ్గి కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజీవ్‌జిత్‌ సింగ్, బిజినెస్‌ హెడ్‌ సుఖేశ్‌ జైన్‌ రాజీనామా చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను అనుగుణంగా ఎప్పటికప్పుడు సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ సుదీర్ఘకాలం పాటు పోటీలో నిలబడాలంటే ఇలాంటి తప్పవని యాజమాన్యం తెలిపింది. 

హాస్పిటాలిటీ జెయింట్ ఓయో  దేశవ్యాప్తంగా 2,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ వార్తలు తెలుపుతున్నాయి. బిజినెస్‌ అంచనాలకు తగినట్లు ఒకరు చేసిన పనినే మరొకరు చేసే డూప్లికేట్‌ పద్ధతిని తొలగించి, పని సామర్థ్యం పెంచడం కోసం ఇలాంటి చర్యలు అనివార్యం అవుతున్నట్లు కంపెనీ సీఈవో రితేష్‌ అగర్వాల్, ఉద్యోగులకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. 

అమెరికా కేంద్రంగా భారత్‌లో పనిచేస్తున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ నుంచి 350 మంది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నదని ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది. ఏటా రూ. 80 లక్షల నుంచి రూ. 1.2 కోట్ల వేతన ప్యాకేజీ అందుకునే ఉద్యోగులే ఎక్కువ మంది బాధితులవుతారని తెల్సింది. వాస్తవానికి ఈ కంపెనీ గత నవంబర్‌ నెలలోనే ఖర్చు నియంత్రణలో భాగంగా సమీప భవిష్యత్లో 7000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. 

క్యాబ్ అగ్రిగేటర్ ఓలా గత నెలలోనే 500 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు, అందుకు భారత ఆర్థిక మాంద్యమే కారణమని ‘ఎన్‌ట్రాకర్‌ వెబ్‌సైట్‌’ వెల్లడించింది. నష్టాల తగ్గింపు కోసం రానున్న నెలల్లో మరి కొంత మందిని తీసేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ వద్ద 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో ఐదు నుంచి ఏడు శాతం మందినే తొలగించనున్నట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. 

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం యాజమాన్యం గత నెలలో 500 మంది మధ్య, జూనియర్‌ స్థాయి ఉద్యోగులను వెళ్లిపోవాలని కోరినట్లు ‘ఎన్‌ట్రాకర్‌’ పేర్కొంది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల పనితీరును మెరగుపర్చడంలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ సర్వీసెస్ సంస్థ క్వికర్ గత డిసెంబర్‌ నెలలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ‘ఐఏఎన్‌ఎస్‌’ వార్తా సంస్థ వెల్లడించింది. కార్మిక శక్తి హేతుబద్ధీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యం ఈ కోతలు కార్మికులకు కడుపుకోత మిగల్చనున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios