లాక్డౌన్తో కష్టాలు: ఆదుకునేందుకు ప్రజల ఇంటివద్దకే నిత్యాసరాల పంపిణీ
ఇంటికి పరిమితమైన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను పంపిణీ చేసేందుకు పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి.ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి.
ముంబై: కరోనా వైరస్, లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులను ఆదుకునేందుకు పలు సంస్థలు నడుం బిగించాయి. ఇంటికి పరిమితమైన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను పంపిణీ చేసేందుకు పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి.
ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి. ఉబెర్, డామినోస్ పిజ్జా , ర్యాపిడో, జైప్, స్విగ్గీ, జొమాటో, స్కూట్సీ వంటి సంస్థలు బిగ్ బజార్, స్పెన్పర్ , బిగ్ బాస్కెట్ గ్రోఫర్స్ లాంటి సంస్థలతో నిత్యావసరాల పంపిణీకి భాగ స్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
అంతేకాదు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దిగ్గజాలతోనూ ఈ విషయమై చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ప్రముఖ రిటైల్ సంస్థ స్పెన్సర్స్..క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ భాగస్వామ్యంతో వినియోగదారులకు సరుకుల పంపిణీకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తద్వారా స్పెన్సర్స్ నిత్యావసరాలను వినియోగ దారుల ఆర్డర్ల మేరకు క్యాబ్లలో డోర్ డెలివరీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్పెన్సర్స్ స్టోర్ల నుంచి ఈ సేవలు అందిచనున్నారు.
ఇప్పటికే కోల్కతా, లక్నో, ఘజియాబాద్ వంటి నగరాల్లో ట్రైల్ రన్ నిర్వహించగా అది విజయవంతమైందని స్పెన్సర్స్ వెల్ల్లడించింది. ద్విచక్ర వాహనాలకంటే అధిక మొత్తంలో సరుకులను వినియోగ దారులకు అందచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పెన్సర్ తెలిపింది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఖాతాదారులకు నిత్యవసర సరుకులకు ఎటువంటి లోటు లేకుండా అందించేందుకు క్యాబ్ అగ్రిగేటర్ ఊబర్తో కలిసి పనిచేస్తున్నట్లు స్పెన్సర్స్ రిటైల్, నేచుర్స్ బాస్కెట్ ఎండీ దేవేంద్ర చావ్లా వెల్లడించారు.
ఈ భాగస్వామ్యంతో ఆన్లైన్, ఫోన్ల ద్వారా వచ్చే ఆర్డర్లను ఊబర్ క్యాబ్లలో సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.
బైక్లకంటే క్యాబ్లలోనే అధిక మొత్తంలో నిత్యవసరాలను సుదూర ప్రాంతాల్లోని కస్టమర్ల ఇళ్లకు సైతం చేరవేసే సదుపాయం ఉండడంతో ఈ సర్వీసులపై మొగ్గుచూపుతున్నట్లు స్పెన్సర్స్ రిటైల్, నేచుర్స్ బాస్కెట్ ఎండీ దేవేంద్ర చావ్లా వివరించారు.
కరోనా లాక్డౌన్ కాలంలో ప్రజలకు నిత్యవసరాల కొరత ఏర్పడకుండా ఉండేందుకు స్పెన్సర్స్ రిటైల్తో కలిసి పనిచేస్తున్నట్లు ఉబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా డైరెక్టర్ పరభ్జీత్ సింగ్ తెలిపారు.
అంతేకాక ఈ కష్టకాలంలో తమ ఊబర్ క్యాబ్ డ్రైవర్లకు ఆదాయం సమకూర్చేందుకు ఇది ఉపయోగపడుతున్నందున ఎటువంటి చార్జీలు గానీ కమీషన్లు గాని తమ సంస్థ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇంకా జొమాటో డామినోస్ ఐటీసీతో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇంకా లక్షలమంది రీటైల్ వర్తకులతో చర్చలు జరుపుతున్నట్టు జొమాటో వెల్లడించింది.
అలాగే స్పెన్సర్స్ కు చెందిన నేచుర్స్ బాస్కెట్ సంస్థ బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, బిగ్ బజార్, పండ్లు, కూరగాయల పంపిణీకి నింజాకార్ట్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందాల ద్వారా దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్లలో 70 శాతం మందికి ఉపాధి లభించడంతోపాటు, వినియోగదారులకు అవసరాలు కూడా తీరతాయని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంక వ్యాఖ్యానించారు.