Asianet News TeluguAsianet News Telugu

Budget 2020:పాత వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు...

ఓల్డ్ వాహనాలను తొలగించేందుకు స్క్రాపేజీ పాలసీని అమలు చేయాలని కేంద్రాన్ని ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ సొసైటీ (సియామ్) కోరుతున్నది. జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి పడిపోతుందని పేర్కొంది. బీఎస్-6 ప్రమాణాల అమలు దిశగా తీసుకునే చర్యలకు తోడు జీఎస్టీ తగ్గింపు వల్ల వాహనాల కొనుగోళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Auto sector seeks incentive-based scrappage scheme in Budget
Author
Hyderabad, First Published Jan 29, 2020, 11:46 AM IST

న్యూఢిల్లీ‌: ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉన్నదని ఆటో రంగ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే దేశంలోనే రెండో అతిపెద్దదైనా ఈ రంగం ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేని ఆటోమొబైల్ ప్రముఖులు పేర్కొంటున్నారు. 

ప్రత్యేకించి ఆటోమొబైల్‌ రంగంలో ఆకర్షణీయమైన స్క్రాప్‌ పాలసీని తొందరగా అమల్లోకి తేగలిగినప్పుడే ఆటోమొబైల్‌ రంగంలో కొనుగోళ్లు వేగవంతం అవుతాయి. స్క్రాప్ పాలసీపై ‘ది సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చరర్స్ (సియామ్)’ ప్రభుత్వానికి కొన్ని అభ్యర్థనలు చేసింది.  

మంచి రాయితీలతో కూడిన స్క్రాపింగ్‌ పాలసీని కేంద్రం ప్రకటిస్తే పాత వాహనాలను వదిలించుకుని ప్రజలు కొత్త వాహనాలకు మళ్లుతారని.. అప్పుడు ఆటోమొబైల్‌ పరిశ్రమ పుంజుకొంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను తొలగించుకున్న వారికి జీఎస్టీలో 50శాతం రాయితీ, రోడ్డు పన్నులో మరో 50శాతం రాయితీ ఇవ్వాలని అడుగుతోంది. 

also read Budget 2020: ఎలక్ట్రిక్ కార్లకు ఐటీ... విద్యుత్ సైకిళ్లపై జీఎస్టీ...

ప్రయాణికుల వాహనాలపై తరుగుదలను 25శాతం పెంచాలని సియామ్ డిమాండ్‌ చేసింది. దీంతో పాటు ప్రభుత్వ హయాంలోని రవాణా శాఖలు ఐసీఈ బస్సులు కొనేలా కేటాయింపులు చేయాలని కోరింది. ఫేమ్‌-2 స్కీం కింద విద్యుద్ బస్సులు కొనేలా చూడాలని సూచించింది. ఇప్పటికే బీఎస్-‌6 నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన ధరలు పెరగనున్నాయి. 

బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న వాహనాలను ప్రభుత్వం  ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరుతోంది.  దీంతోపాటు విద్యుత్ వాహనాలకు వినియోగించే లిథియం అయాన్‌ సెల్స్‌పై ఐదు శాతం పన్ను తొలగించాలని కోరింది. ఈ చర్య దేశీయంగా బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఊపునిస్తుంది.

కొన్నాళ్ల నుంచి ఆటోమొబైల్‌ రంగం కొనుగోళ్లు లేక ఇబ్బందుల పాలవుతోంది. గతేడాది డిసెంబర్‌లో 16,17,398 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ డిసెంబర్‌లో 14,05,776 వాహనాలు విక్రయించారు.2019లో 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత పడి పోయాయి. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విక్రయం 2018 డిసెంబర్లో 75,984 ఉండగా.. గత డిసెంబర్లో 12శాతం తగ్గి 66,622కు చేరింది. ఇక మొత్తం వాహనాల ఉత్పత్తి కూడా 18,16,112కి తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 5.22 శాతం తక్కువ అన్నమాట. ఆ మేరకు ఉద్యోగాలకు కూడా కోతపడే అవకాశాలు ఉన్నాయి.

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో వాహన కొనుగోళ్లకు బ్యాంకేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు అత్యధికంగా అప్పులు ఇస్తున్నాయి. మూడింట ఒక వంతు కొనుగోళ్లు వీటి అప్పులతోనే జరుగుతాయి.కానీ, ఎన్బీఎఫ్సీలు ఇప్పుడు తీవ్రమైన నగదు కొరతను  ఎదుర్కొవడంతో రుణ లభ్యత తగ్గింది. దీంతో కొనుగోళ్లు పడి పోయాయి. మరోపక్క బ్యాంకులు వాహన కొనుగోళ్ల నిబంధనలను కఠిన తరం చేయడమూ పులిమీద పుట్రలాగ మారింది.  

 

ఈ ఏడాది నుంచి బీఎస్-‌6 నిబంధనలు అమల్లో రానుండంటంతో చాలా మంది వాహన కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపేయడంతో అమ్మకాలు పడిపోయాయి.ఇప్పటికే ఉత్పత్తి చేసిన వాహనాల పరిస్థితి ఏమిటీ? అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడం దీనికి మరో కారణం. ఇప్పటికే ఢిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ఇంకా బీఎస్‌-6 ఇంధనం అందుబాటులోకి రాలేదు. 

మరోపక్క కంపెనీలు కూడా తమ టెక్నాలజీని బీఎస్‌-6కు అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో మార్కెట్లో వాహనాల డిమాండ్‌ పడిపోవడం వాటిని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తోంది.  బీఎస్‌-6 నిబంధనలు ముఖ్యంగా డీజిల్‌ ఇంజిన్ల భవిష్యత్‌ను ప్రమాదంలో పడేశాయి.

పెట్రోల్‌ ఇంజిన్ల ధరలు రూ.30వేల వరకు పెరిగితే.. డీజిల్‌ ఇంజిన్ల ధరలు రూ.1లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. వీటి జీవిత కాలాన్ని ఇప్పటికే దిల్లీలో 10 ఏళ్లకు కుదించారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తారనే భయాలు ఉన్నాయి. 

వ్యవసాయ రంగం కూడా పెద్దగా ఆశాజనకంగా లేకపోవడంతో ట్రాక్టర్ల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. వరదలు, కరవు వంటి సంక్షోభ పరిస్థితులతో వ్యవసాయరంగం కుదేలైంది. సాధారణంగా ట్రాక్టర్ల విభాగంలో చాలా అరుదుగా కొనుగోళ్లు తగ్గుతాయి. కానీ మహీంద్రా అండ్‌ మహీంద్రా ట్రాక్టర్ల విక్రయాలు, ఎస్కార్ట్స్‌ విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి. 

కాలుష్య నియంత్రణ కోసం సర్కార్ యాక్సెల్‌ లోడ్‌ నిబంధనల్లో ఇటీవల మార్పులు తెచ్చింది. దీంతో వాణిజ్య వాహనాలు మోసే బరువు పరిమితి పెరిగింది. ఇది ఒక రకంగా ఇంధన వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. కానీ, కొత్త వాహన కొనుగోళ్లు (ట్రక్కులు, ట్యాంకర్లు వంటివి) గణనీయంగా తగ్గాయి. ఈ దెబ్బకు అశోక్‌ లేలాండ్‌ పంత్‌నగర్‌ ప్లాంట్‌ను రోజుల తరబడి మూసేయాల్సి వచ్చింది. టాటామోటార్స్‌ కూడా పంత్‌నగర్‌ ప్లాంట్‌ను కొన్నాళ్లు మూసేసింది. 

బీఎస్-‌6 నిబంధనల అమలుకు ముందు ఉన్న బీఎస్‌-4 స్టాక్‌ను వదిలించుకోవడానికి కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తాయని వినియోగదారులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో అప్పటి వరకు వేచి ఉండాలనే ధోరణి అవలంభిస్తున్నారు. గతంలోనూ జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు, బీఎస్‌-3 వాహనాల విక్రయాన్ని నిషేధించినప్పుడు 2017లో కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆటో పరిశ్రమపై క్యాబ్‌ సేవల ఎఫెక్ట్‌ భారీగానే ఉంది. ఈ సేవలు విస్తరించే కొద్దీ .. సొంత వాహన కొనుగోళ్లపై ఆసక్తి తగ్గుతోంది. ఉబెర్‌, ఓలా యాప్‌ల్లో గతంలో కేవలం కార్లను మాత్రమే బుక్‌ చేసుకునే అవకాశం ఉంది.కానీ, ఇప్పుడు అవి ఆటో రిక్షాలు, మోటార్‌ బైక్‌లను బుక్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్‌ పెరగడంతో ఉద్యోగాలు చేసే యువత చాలా సేపు డ్రైవింగ్‌లో సమయం వృథా చేసుకోవడానికి ఇష్ట పడటం లేదు. దీంతో కార్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. 

also read budget 2020: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్...రూ. 7 లక్షల దాకా.. నో ట్యాక్స్...

పార్కింగ్‌ సమస్యలు, డ్రైవింగ్‌ నిబంధనలు కఠినతరం కావడం వంటివి కూడా ఆటో పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. మరోపక్క ప్రభుత్వాలు కూడా ప్రజా రవాణాను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి.చాలా నగరాల్లో ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులోకి తేవడంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతోంది. మరోవైపు ఢిల్లీలో మహిళలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ఉచిత ప్రయాణాలను ఇవ్వడం వంటి చర్యలు కూడా వాహన రంగంపై  ప్రతికూల ప్రభావం చూపే అంశమే. 

ఈసారి బడ్జెట్‌లో జీఎస్టీని తగ్గించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆశించింది. కానీ, ప్రభుత్వం విద్యుత్ వాహనాలకు మాత్రమే జీఎస్టీని తగ్గించింది. దీంతో చాలా మంది భవిష్యత్‌లో ప్రభుత్వం కచ్చితంగా జీఎస్టీని తగ్గిస్తుందని నమ్ముతున్నారు. ఆ తగ్గింపు ప్రకటన కోసం వేచి చూస్తూ వాహన కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌ 2020లో జీఎస్టీ తగ్గించాలని సియాం కూడా కోరింది. 

మరోవైపు ఆర్థిక మందగమనం ముదిరి మాంద్యం ముంచుకొస్తోందనే భయాలు మార్కెట్లను ఊపేస్తున్నాయి. దీంతో చాలా మంది వ్యయం తగ్గించుకుని పొదుపుబాట పడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు ఈ క్యాటగిరిలోకి వస్తారు. మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోకపోవడంతో ట్రక్కులు, కార్లకు డిమాండ్‌ తగ్గుతోంది. 

గత ఐదేళ్లుగా సెకండ్‌ హ్యాండ్‌ వాహన మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది కొత్త వాహనాల కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మరోపక్క కొత్త కాలుష్య నిబంధనలతో వాహన ధరలు పెరుగుతుండటంతో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ వినియోగదారులకు బలమైన ఎంపికగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios