బీజేపీ అగ్రిగోల్డ్ బాధితుల దీక్షలు: తీవ్ర వ్యాఖ్యలు చేసిన లోకేష్
అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విమర్శించారు
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విమర్శించారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా బీజేపీ నేతల దీక్షలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
దొంగే, దొంగ...దొంగ అని అరిచినట్టు బీజేపీ నేతలు దీక్ష చేసారు.నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది.
— Lokesh Nara (@naralokesh) October 22, 2018
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ ఐదు రోజుల పాటు రిలే దీక్షలను సోమవారం నాడు ప్రారంభించింది.ఈ దీక్షలపై ఏపీ మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.నోట్ల రద్దు నుండి రఫెల్ కుంభకోణం వరకూ దేశాన్ని దోచేసి, దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్న బీజేపీ నాయకులు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్ష చెయ్యడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అనేక అంశాల్లో ఏపీ దేశంలోనే భాగం కాదనట్టుగా బీజేపీ నేతలు వ్యవహరించారని లోకేష్ విమర్శించారు. అగ్రిగోల్డ్ అంటూ బీజేపీ కొత్త కుట్రకు తెరలేపిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నా బీజేపీ నేతలు దీక్షలంటూ కొత్త కుట్రకు తెరతీశారని చెప్పారు.
కోర్టులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.