ఇటు రోల్స్రాయిస్ ఎస్యూవీ ‘కాలినన్’.. అటు పియాజియో ‘ఏప్రిలియా స్ట్రామ్’
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘రోల్స్ రాయిస్’విపణిలోకి తొలి విడత ఎస్యూవీ మోడల్ కారు ‘కాలినన్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.6.95 కోట్లుగా నిర్ణయించారు.
చెన్నై: రోల్స్రాయిస్ మోటార్ కార్స్ తన తొలి లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)‘కాలినన్’ను లాంఛనంగా ఆవిష్కరించింది. దీని ధర రూ.6.95 కోట్లు. ఈ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ (అపాక్) రీజినల్ సేల్స్ మేనేజర్ డేవిడ్ కిమ్, కున్ మోటార్ కంపెనీ ప్రిన్సిపల్ డీలర్ వసంతి భూపతి పాల్గొన్నారు.
అధిక స్థాయి పనితీరు, ఆఫ్రోడ్ సామర్థ్యాలు, మెరుగైన వసతులను కోరుకుంటున్న కస్టమర్ల నుంచి ఈ లగ్జరీ ఎస్యూవీ కాలినన్ కారుకు డిమాండ్ ఏర్పడుతుందని వసంతి పేర్కొన్నారు. 6.75 వీ12 ట్విన్ టర్బో ఇంజన్ కలిగిన ఈ కారు 567 హార్స్ పవర్ను వెలువరుస్తుందని కంపెనీ తెలిపింది.
భారత మార్కెట్లో భారీ పురోగతి సాధించేందుకు కాలినన్ కారు ఉపకరిస్తుందని రోల్స్ రాయిస్ భావిస్తోంది. రోల్స్ రాయిస్ ఎగ్జిక్యూటివ్లు స్పందిస్తూ యువతరం ఎక్కువగా రోల్స్ రాయిస్ కార్లనే కొనుగోలు చేస్తున్నారన్నారు. సగటున 35 ఏళ్ల లోపు వయస్కులకు ఇష్టమైన బ్రాండ్గా రోల్స్ రాయిస్ నిలిచింది.
కొన్నేళ్లుగా డిజైనింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్ జరిపిన తర్వాత మార్కెట్లోకి కాలినన్ మోడల్ కారును తెచ్చామని రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ (అపాక్) రీజినల్ సేల్స్ మేనేజర్ డేవిడ్ కిమ్ చెప్పారు. ఇంతకుముందుతో పోలిస్తే భారతదేశంలో రోల్స్ రాయిస్ సేల్స్ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా 4,107 కార్లు అమ్ముడు పోయాయి. ఆర్థిక మందగమనం సూపర్ లగ్జరీ సెగ్మెంట్లో భారతదేశంలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
పియాజియో ఏప్రిలియా స్ట్రామ్ ధర రూ.65 వేలే
ఇటలీ ద్విచక్రవాహన సంస్థ పియోజియో ప్రీమియం స్కూటర్ బ్రాండ్ ‘ఏప్రిలియా’ను విస్తరించింది. గురువారం విపణిలోకి ఏప్రిలియా స్ట్రామ్ను విడుదల చేసింది. దీని ధర రూ.65,000గా నిర్ణయించారు. ‘భారత్లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏప్రిలియా స్ట్రామ్ను విడుదల చేశాం. ఏప్రిలియా డిజైన్లో కట్టింగ్ ఎడ్జ్ పరిజ్ఞానాన్ని వినియోగించాం. ఫలితంగా పలు ప్రీమియం ఉత్పత్తులను రూపొందించాం’ అని పియాజియో వెహికల్స్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ డిగో గ్రాఫీ అన్నారు.