తొమ్మిది నెలల తర్వాత ‘మారుతి’ ఉత్పత్తి పెంపు
తొమ్మిది నెలల తర్వాత ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఉత్పత్తి పెంచింది. అయితే మినీ, కంపాక్ట్ మోడల్ కార్ల ఉత్పత్తి తగ్గించి వేసింది.
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో వరుసగా తొమ్మిది నెలలుగా ఉత్పత్తిని తగ్గించుకున్న మారుతి సుజుకీ ఎట్టకేలకు గత నెలలో తన ఉత్పత్తిని పెంచుకున్నది. నవంబర్ నెలలో సంస్థ 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది.
also read భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే....
క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 1,35,946లతో పోలిస్తే 4.33 శాతం అధికమని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. గత నెలలో 1,39,084 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేసింది.
వీటిలో ఆల్టో, న్యూ వ్యాగన్ఆర్, సెలేరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్లు నికరంగా 1,02,185 యూనిట్లు ఉండగా, మినీ సెగ్మెంట్కు చెందిన ఆల్టో, ఎస్-ప్రెస్లు 24 వేల యూనిట్లు ఉన్నాయి. అలాగే 27,187 యూనిట్ల యుటిలిటీ వాహనాలైన విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్లు ఉన్నాయి.
also read నిస్సాన్ కార్లపై అధ్బుతమైన అఫర్లు
మధ్య స్థాయి సెడాన్ సియాజ్ 1,830ల వాహనాలను ఉత్పత్తి చేసింది. వీటితోపాటు లైట్ కమర్షియల్ వాహనాల ఉత్పత్తిని కూడా పెంచింది మారుతి. అయితే మినీ, కంపాక్ట్ సెగ్మెంట్ కార్ల ఉత్పత్తిని మాత్రం మారుతి తగ్గించి వేసింది.
అక్టోబర్ నెలలో ఏకంగా ఉత్పత్తిని 20 శాతం తగ్గించిన సంస్థ..ఆ మరుసటి నెలలోనే పెంచుకోవడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ నెలలో వాహనాల ఉత్పత్తిని 20.7 శాతం తగ్గించి 1,19,337 వాహనాలను, సెప్టెంబర్ నెలలో 17.48 శాతం తగ్గించి 1,32,199 యూనిట్ల వాహనాలను మాత్రమే మారుతి సుజుకి ఉత్పత్తి చేసింది.