స్టాక్స్ క్లియరెన్స్ సేల్... కార్లపై డిస్కౌంట్ ఆఫర్ల వర్షం
2019 ముగింపుకు వస్తోంది. మాంద్యం ప్రభావం.. డిమాండ్ లేక వాహనాల కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. తమ వద్ద ఉన్న స్టాక్స్ క్లియరెన్స్ కోసం మారుతి సుజుకి, నిస్సాన్ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థలకు 2019 నిరాశే మిగిల్చింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం సెగ, మరోవైపు వినియోగదారుల్లో సెంటిమెంట్ నిరాశావాదంగా ఉండటంతో టాప్గేర్లో దూసుకెళ్లిన వాహన విక్రయాలకు బ్రేక్పడినట్లు అయింది.
పండుగ సీజన్ మినహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో గట్టి షాక్ తగిలింది. దీంతో చేసేదేమీ లేక సంస్థలు తమ వద్ద పేరుకున్న స్టాక్లను వదిలించుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి సంస్థలు. దీంట్లో భాగంగా పలు సంస్థలు రాయితీలను తెరపైకి తెచ్చాయి.
2019 చివరి నెల డిసెంబర్లో డిస్కౌంట్లను ప్రకటిస్తున్న సంస్థలు ఈసారి వినియోగదారులను ఆకట్టుకోవడానికి భారీగా ఆఫర్లు ప్రకటించాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ అయితే ఏకంగా రూ. లక్షకు పైగా రాయితీ ప్రకటించింది.
also read తొమ్మిది నెలల తర్వాత ‘మారుతి’ ఉత్పత్తి పెంపు
బాలెనో, సియాజ్, ఇగ్నిస్, ఎస్-క్రాస్ మోడళ్లపై రూ.1.13 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. జపాన్కు చెందిన నిస్సాన్ కూడా రూ.1.15 లక్షల వరకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించనున్నట్లు ప్రకటించింది.
బాలెనో పెట్రోల్ వేరియంట్పై రూ.45 వేల ఆఫర్
మల్టీపర్పస్ వాహనమైన బాలెనోపై మారుతి రూ.45 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. వీటిలో వినియోగదారుల రాయితీ కింద రూ.25 వేలు ఇవ్వనున్న సంస్థ.. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.15 వేలు, కార్పొరేట్ ఆఫర్ కింద మరో రూ.5 వేలు కల్పిస్తున్నది.
బాలెనో డీజిల్ వేరియంట్పై రూ.67 వేల రాయితీ
మారుతికి చెందిన బాలెనో డీజిల్ రకాన్ని కొనుగోలు చేసినవారికి రూ.67,400 ప్రయోజనాలు కల్పిస్తున్నది సంస్థ. దీంట్లో కన్జ్యూమర్ డిస్కౌంట్ కింద రూ.25 వేలు లభిస్తున్నది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ ఆఫర్ కింద మరో రూ.10 వేలు లభిస్తాయి. ఈ కారుపై ఐదేళ్ల వ్యారెంటీ ఉచితంగా అందిస్తున్నది.
సియాజ్ పెట్రోల్ వర్షన్ కారుపై రూ.75 వేల వరకు బెనిఫిట్లు
పెట్రోల్ ఇంజిన్ కలిగిన సియాజ్పై రూ.75 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది మారుతి. వీటిలో వినియోగదారుల డిస్కౌంట్ కింద రూ.25 వేలు లభించనుండగా, అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.40 వేలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.10 వేలు ఇస్తున్నది.
డీజిల్ ఇంజిన్తో తయారైన సియాజ్ మోడల్ కారుపై రూ.1.13 లక్షల వరకు ప్రయోజనం లభించనున్నది. దీంట్లో కన్జ్యూమర్ డిస్కౌంట్ కింద రూ.40 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.40 వేలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.10 వేలు లభించనున్నాయి. ఎలాంటి చెల్లింపులు జరుపకుండా ఈ కారుపై అదనంగా ఐదేళ్ల వ్యారెంటీ కూడా కల్పిస్తున్నది.
ఇగ్నిస్ పెట్రోల్ వర్షన్ కారుపై రూ.65 వేల వరకు ఆదా
ఇగ్నిస్ పెట్రోల్ వెర్షన్ను కొనుగోలు చేసిన వారు రూ.65 వేల ఆదా కానున్నది. దీంట్లో కస్టమర్ డిస్కౌంట్ కింద రూ.30 వేలు, ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో రూ.25 వేలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.10వేలు ఇస్తున్నది.
also read ప్రపంచ వ్యాప్తంగా పడిపోయిన ఆ లగ్జరీ కార్ల అమ్మకాలు...
ఎస్-క్రాస్ డీజిల్ వర్షన్ కార్లపై రూ.1.13 లక్షల వరకు లబ్ధి
ప్రీమియం కారైన ఎస్-క్రాస్పై మారుతి రూ.1.13 లక్షల వరకు మారుతి సుజుకి ప్రయోజనాలు కల్పిస్తున్నది. ఈ డీజిల్ కారుపై రూ.50 వేలు కన్జ్యూమర్ డిస్కౌంట్ లభించనుండగా, ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.30 వేలు, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.10 వేలు ఆదా కానున్నది. దీంతోపాటు ఐదేళ్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో ఈ కారును కొనుగోలు చేసిన వారికి మరో రూ.10 వేలు రాయితీ లభించనున్నది.
నిస్సాన్ ‘రెడ్ వీకెండ్స్ ప్రొగ్రామ్' ఇలా
జపాన్కు చెందిన ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తాజాగా ‘రెడ్ వీకెండ్స్ పేరుతో కొనుగోలుదారులకు రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలు కల్పించనున్నది. వీటిలో నగదు రాయితీ కింద రూ.40 వేలు అందిస్తున్న సంస్థ..ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.40 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేలు అందిస్తున్నది.
తొలిసారి కారును కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్తో ద్విచక్ర వాహనం నుంచి డాట్సన్ రెడీ-గోతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్లు అవుతుందని నిస్సాన్ ఇండియా ఎండీ రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. అలాగే తొలిసారి కారును కొనుగోలు చేసిన వారికి 6.99 శాతం వడ్డీకే ఫైనాన్స్ సేవలు అందిస్తున్నట్లు, ఇది 36 నెలల్లో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.