సర్ఫ్రైజ్ ఆఫర్ల బాటలో ‘ఫోర్డ్’.. మహింద్రాతో ఇలా జట్టు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ- కామర్స్ సంస్థల మాదిరిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కూడా తన వినియోగదారులకు సర్ ప్రైజ్ ఆఫర్లు ప్రకటించింది. 7-9 తేదీల్లో కార్లు బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్లు లభిస్తాయి. ఇక మహీంద్రా షోరూంల్లో ఫోర్డ్ కార్లు విక్రయించనున్నారు.
న్యూఢిల్లీ: రిటైల్, ఈ - కామర్స్ సంస్థల మాదిరిగా ప్రముఖ కార్ల విక్రయ సంస్థ ఫోర్డ్ ఇండియా తన వినియోగదారులకు సర్ ప్రైజ్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మూడు రోజుల పాటు తమ కార్లను బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.11 కోట్ల విలువైన బహుమతులు అందించనున్నది. గృహోపకరణాలు, బంగారు నాణేలు, ఐఫోన్ ఎక్స్, హై-ఎండ్ ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, హోమ్ థియేటర్ సిస్టమ్, మైక్రోవేవ్స్తోపాటు ఏడు రోజులపాటు ప్యారిస్ పర్యటనను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.
బుకింగ్ల కోసం కంపెనీ షోరూంలను ఉదయం 9 గంటల నుంచి మధ్యరాత్రి వరకు కంపెనీకి చెందిన తెరిచి ఉంచుతామని ఒక ప్రకటనలో తెలిపింది. బంపర్ బహుమతి కింద అందిస్తున్న ఫోర్డ్ ఫిగో కారు విజేతను వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన సంస్థ ప్రకటించనున్నది.
మహింద్రా షోరూంల్లో ఫోర్డ్ కార్ల విక్రయం
దేశీయ ఆటోమొబైల్ మహీంద్రా తన షోరూంల్లో ఇక నుంచి ఫోర్డ్ కార్లను కూడా విక్రయించనున్నది. సంయుక్తంగా వాహన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థలతో మహీంద్రా ఇప్పటికే జత కట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఫోర్డ్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే ఉన్న ఫోర్డ్ డీలర్ల నుంచి ఆశించిన స్థాయిలో విక్రయాలు లేకపోవడంతో ఈ కొత్త భాగస్వామ్యానికి తెర తీసింది. ఈ ఒప్పందంతో ఫోర్డ్ కార్లు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విక్రయించే అవకాశం ఉంది.
తొలి దశలో 15 పట్టణాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు
ఫోర్డ్ కార్ల విక్రయం కోసం మహీంద్రా చిన్న చిన్న డీలర్ షిప్లను కూడా ప్రారంభించనుంది. వీటిల్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి జనాదరణ కలిగిన మోడళ్లను విక్రయిస్తాయి. ప్రస్తుతం దీనిని టైర్ 4+ పట్టణాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెండు సంస్థలు ప్రారంభిస్తాయి. ఈ షోరూముల్లో ఫోర్డు కార్లకు సర్వీసింగ్ కూడా చేస్తారు. తొలుత ప్రయోగాత్మకంగా 15పట్టణాల్లో దీనిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫోర్డ్, మహీంద్రా భారత్ స్టేజ్-6 ఇంజిన్ సాంకేతికతను బదిలీ విషయమై కూడా ఒప్పందానికి వచ్చాయి.