కరోనాపై లాక్ డౌన్ ఎఫెక్ట్: జావా బైక్స్ తయారీ నిలిపివేత
మహీంద్రా గ్రూప్నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ సంస్థ జావా మోటార్ సైకిళ్ల తయారీని నిలిపివేసింది. పిథాంపూర్లోని ప్లాంట్లో ఈ మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్నారు
ముంబై: మహీంద్రా గ్రూప్నకు చెందిన క్లాసిక్ లెజెండ్స్ సంస్థ జావా మోటార్ సైకిళ్ల తయారీని నిలిపివేసింది. పిథాంపూర్లోని ప్లాంట్లో ఈ మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభించడం, ప్రభుత్వం 144 సెక్షన్ వంటివి అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో మోటార్ సైకిళ్ల డెలివరీలపై కూడా దీని ప్రభావం పడనుంది.
ప్రత్యేకించి వచ్చే నెల రెండో తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం జావా పెరాక్ బబ్బర్ తరహా మోటారు సైకిళ్ల డెలివరీ జాప్యం కానున్నది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో డెలివరీ చేయాల్సిన జావా, జావా ఫార్టీ టూ బైక్స్ డెలివరీ కూడా నిరవధిక వాయిదా పడనున్నది.
క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశీష్ సింగ్ జోషీ మాట్లాడుతూ ‘‘ఇది అనుకోని పరిస్థితి. మాకు, మా వినియోగదారులకు, మాతో కలిసి పనిచేసేవారి ఆరోగ్య భద్రత ముఖ్యం. కరోనా నుంచి వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధమైపోతాం. పరిస్థితులు సాధారణమయ్యాక మా ప్రొడక్షన్ శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తాం’’ అని పేర్కొన్నారు.
క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో తయారవుతున్న జావా మోటారు సైకిళ్లకు గత జనవరి నుంచే చైనా నుంచి సరఫరా అయ్యే విడి భాగాల సరఫరా సమస్య తలెత్తింది. గత మూడు వారాలుగా ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటి వరకు జావా మోటార్ సైకిళ్ల విడి భాగాల నిల్వలు లేవు. నికాసిల్ కోటింగ్, ఎల్సీడీ ఇన్ర్సుమెంట్ ప్యానెల్ తదితరాలు నిలిచిపోయాయి. ఫలితంగా భారత దేశ సరఫరా దారులు కూడా విడి భాగాల సరఫరా నిలిపివేశారు.
31 వరకు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి నిలిపివేత
ఈ నెల 31 వరకు అన్ని ప్రొడక్షన్ యూనిట్లు, కార్యాలయాల్లో కార్యకలాపాలను నిలిపివేసినట్లు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. వివిధ అధికార వర్గాల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఇప్పటికే కొన్ని విడి భాగాల సరఫరాపై ప్రభావం పడిందని తెలిపింది. ఈ నెల ఉత్పత్తి లక్ష్యంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొంది.
also read:కరోనా ఎఫెక్ట్: అగ్ర రాజ్యం నుంచి ‘క్లోరోక్వీన్’కు ఫుల్ డిమాండ్
కోకాకోలాలో కూల్ డ్రింక్స్ తయారీ స్టాప్
ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా అన్ని ప్రొడక్షన్ యూనిట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నీరు, పళ్ల రసాలు, టీ, కాఫీ వంటి వాటి ఉత్పత్తి కొనసాగించనున్నట్లు పేర్కొంది. పెప్సికో బాట్లింగ్ భాగస్వామి వరుణ్ బేవరేజెస్ సైతం ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపింది.
భారత్లో వోక్స్ వేగన్ ప్లాంట్ మూసివేత
కరోనా విజృంభిస్తున్న వేళ భారత్లోని తమ ప్లాంట్ను మూసివేస్తున్నట్లు వోక్స్ వేగన్ తెలిపింది. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటామోటార్స్, ఎఫ్సీఏ ఇండియా, వోల్వో వంటి సంస్థలు తమ ఉత్పత్తిని మార్చి31 వరకు నిలిపివేసిన విషయం తెలిసిందే. భారత్లో కరోనావైరస్ కేసులు మెల్లగా పెరుగుతుండటంతో వోక్స్వేగన్ కూడా ఈ నిర్ణయం తీసుకొంది. స్కోడా ఆటో వోక్స్వేగన్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.