ధరలు పెంచేసిన బజాజ్: పల్సర్ సహా అన్ని మోడల్స్
బజాజ్ ఆటోమొబైల్ తాను ఉత్పత్తి చేస్తున్న మోటారు బైక్ల ధరలు పెంచేసింది. అత్యంత డిమాండ్ ఉన్న పల్సర్ మోడల్ మోటారు సైకిళ్లతోపాటు ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన వీ 15, డోమినియర్ ధరల కూడా పెంచేసింది.
ముంబై: బజాజ్ ఆటోమొబైల్స్ తాను ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల మోడల్ మోటారు సైకిళ్ల ధరలను పెంచేసింది. ఇటీవలే బజాజ్ డోమినర్ 400 ధర రూ.6,000 వరకు పెంచింది. తాజాగా పెంచిన మోటారు సైకిళ్ల ధరలు గరిష్ఠంగా రూ.2,950 వరకు పెరిగాయి. దీంతో అత్యంత కీలకమైన పల్సర్ మోడళ్లతోపాటు డిస్కవర్, ప్లాటిన మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. అవెంజర్ 220 ధర మాత్రం పెరగలేదు.
ఇప్పటికే హీరోమోటోకార్ప్ కూడా తన బైకుల మోడళ్ల ధరలను ఒక శాతం పెంచిన విషయం తెలిసిందే. బజాజ్ పల్సర్ 150 నియాన్పై రూ.2,950, వీ15పై రూ.1,113, ప్లాటినా 100 ఈఎస్పై రూ.1,024 , ప్లాటినా100 కెఎస్, ప్లాటినా 100పై రూ.147 వరకు ధరలు పెరిగాయి. ప్లాటినా హెచ్గేర్లపై ధరల పెంపు లేదు.
ఇటీవలే అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసిన వీ15 మోడల్ బైక్ ‘పవర్ అప్’ ధర కూడా పెంచేసింది. డిస్కవర్ 125 డిస్క్, అండ్ డ్రమ్ వేరియంట్ బైకుల ధరలు కూడా పెరిగిన వాటిలో ఉన్నాయి. పల్సర్ మోడళ్ల వారి ధరల పెంపు రూ. రూ.499 నుంచి రూ.2950 వరకు నమోదైంది.
పల్సర్ నియాన్ ధర రూ.2,950 పెరిగి రూ.71,200లకు లభిస్తుంది. పల్సర్ 150, పల్సర్ 150 ట్విన్ డిస్క్ రూ.88,461, రూ.88,339 నుంచి రూ.499 పెరిగాయి. పల్సర్ 180ఎఫ్ మోడల్ బైక్ ధర రూ.1,012 పెరిగి రూ.95,290కి చేరుకోగా, పల్సర్ 220 ఎఫ్ ధర రూ.2000 పెరుగుదలతో రూ.1.07 లక్షలు పలుకుతుంది.
పల్సర్ ఎన్ఎస్ 160 ధర రూ.499 పెరిగి రూ.93,094లకు, పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర రూ.1000 పెరుగుదలతో రూ.1.13 లక్షలకు చేరుకున్నది. డిస్కవర్ 125 డ్రమ్ బైక్ రూ.752 పెరిగి రూ.58,752లకు, డిస్కవర్ 125 డిస్క్ బైక్ ధర రూ.753లకు చేరి రూ.62,253ల వద్ద స్థిర పడింది. బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ ధర రూ.53,376 నుంచి రూ.499, ప్లాటినా 110 డిస్క్ బైక్ ధర రూ.998 పెరిగి రూ.56,371 వద్ద స్థిర పడింది.