విపణిలోకి అవాన్ మోటార్స్ ఎలక్ర్టిక్ వాహనాలు
ఎలక్ట్రానిక్ స్కూటర్స్ స్టార్టప్ అవాన్ మోటార్స్ ఇక నుంచి నెలకొక ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది. టీవీఎస్ ఎన్ టొర్క్ 125లో మాదిరిగా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ను కూడా త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ: ఎలక్ర్టిక్ వాహనాల తయారీలో ముందున్న అవాన్ మోటార్స్ ఈ రంగంలో మరిన్ని నూతన వాహనాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో జెరో ప్లస్ను ప్రారంభించిన కంపెనీ ఈ వాహనానికి వచ్చిన స్పందనతో మరిన్ని ఈ తరహా ఎలక్ర్టిక్ స్కూటర్లు, వాహనాలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది.
జెరో ప్లస్ స్కూటర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించిందని, ఒక బ్యాటరీతో 60 కిమీ భారీ మైలేజ్ను ఇవ్వడంతో పాటు రూ 47,000కే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతలని అవాన్ మోటార్స్ తెలిపింది. ఇది అత్యంత చౌక ధరకు లభించడంతో వినియోగదారుల నుంచి మంచి మద్దతు లభించింది. ఈ వాహనం విజయవంతం కావడంతో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ తెలిపారు.
గత నెల ప్రారంభంలో ప్రతి నెలలోనూ నూతన ఉత్పత్తిని విపణిలోకి విడుదల చేస్తామని అవాన్ మోటార్స్ పేర్కొంది. సదరు ఉత్పత్తుల (వాహనాల) ధర రూ.45 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వినియోగదారుల వద్ద ఉన్న జీరో సిరీస్ వాహనాలతో తమ వద్ద గల స్మార్ట్ ఫోన్ను అనుసంధానం చేసేందుకు అవసరమైన ఫీచర్లు జత కలిపారు.
ఇంతకుముందు 2018 సెప్టెంబర్ నెలలో అవాన్ స్కూటర్స్ ‘జీరో ప్లస్’ స్కూటర్కు సానుకూల స్పందన లభించింది. సేల్స్ తోపాటు ఈ వాహనాలకు రోడ్డుపైనే సర్వీస్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చింది. అవాన్ మోటార్స్ తన సంస్థ నుంచి వెలువడే వాహనాలకు అత్యధిక వారంటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని యాప్ ఆధారంగా స్మార్ట్ ఫోన్ కు కనెక్టయ్యేలా చూస్తామని సంస్థ తెలిపింది.
అవాన్ మోటార్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ తమ వాహనాలు పర్యావరణ అనుకూలమని పేర్కొన్నారు. జీరో ప్లస్ మోడల్ స్కూటర్కు వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. దీన్ని ఆచరణలో మరింత విజయవంతం చేస్తామన్నారు.