విపణిలోకి యమహా ఎంటీ-09
ప్రముఖ మోటార్ బైక్ ల తయారీ సంస్థ యమహా భారతదేశ మార్కెట్లోకి నూతన ఎంటీ - 09 మోడల్ బైక్ను ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.10.55 లక్షలు.
న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త ఎంటీ-09 బైక్ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.10.55 లక్షలు. పాత మోడల్తో పోల్చితే ధర రూ.16,000 ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా సంస్థ డీలర్ల వద్ద ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. త్వరలోనే డెలివరీ మొదలవుతుందని తెలిపింది.
847సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ కలిగిన ఈ బైక్లో ట్విన్పాడ్ ఎల్ఈడీ లాంప్స్, 6 స్పీడ్ గేర్బాక్స్, క్విక్ సిఫ్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ డిజైన్ దాదాపు ఇంతకు ముందు మాదిరే ఉందని, అయితే కొన్ని కొత్త రంగుల్లో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ బైక్ బరువు 193 కిలోలు. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 14 లీటర్లు ఉంది.యమహా ఎంటీ -09 మోడల్ బైక్ నైట్ ఫ్లూ పెయింట్ తోపాటు బ్లూ, టెక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభించనున్నది. రెడ్ అల్లాయిడ్ వీల్స్, 10000 ఆర్పీఎం వద్ద 113 బీహెచ్పీ, 8500 ఆర్పీఎం వద్ద 87.5 ఎన్ఎం టార్చ్ సామర్థ్యం గల ఇంజిన్ కలిగి ఉన్నది.
యమహా ఎంటీ 09 మోటారు బైక్ ప్రత్యర్థి సంస్థ ట్రయంఫ్ ‘స్ట్రీట్ ట్రిపుల్’, డుకాటీ మాన్ స్టర్ 821, సుజుకి జీఎస్ఎక్స్ -ఎస్ 750, కవాసాకీ జడ్ 900 వంటి మోటారు సైకిళ్లతో పోటీ పడనున్నది. వచ్చేనెల 15 నుంచి ఎంటీ -15 ఆవిష్కరణతో యమహా బైక్ల విస్తరణ కొనసాగనున్నది.