ఏపీలో మరోసాకి ‘కాల్ మనీ’ కలకలం
అఘాయిత్యానికి ప్రయత్నించిన మహిళ
కర్నూలు జిల్లాలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొద్ది నెలల క్రితం ఏపీలో కాల్ మనీ వ్యవహారం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తర్వాతర్వాత దీని గురించి అందరూ మర్చిపోయారు. అప్పుడప్పుడు ప్రతిపక్షాలు ఈ విషయాన్ని చర్చకు తీసుకువచ్చినా అధికార పార్టీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
కాగా.. అనుకోకుండా ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నంద్యాల వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్య యత్నించింది. కాల్మనీ నిర్వాహకుడి వేధింపులు తాళలేక మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మహిళ నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నంద్యాలకు చెందిన ఓ మహిళ అవసరం నిమిత్తం తెలిసిన వ్యక్తి వద్ద అప్పు తీసుకుంది. అయితే సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో కాల్మనీ నిర్వాహకుడు మహిళను వేధింపులకు గురిచేశాడు.
వడ్డీకట్టలేదంటూ అసభ్యకర మెస్సేజ్లు, ఫోన్లు చేసి ఇబ్బందికి గురిచేశాడు. దీనిపై రెండు రోజుల క్రితం ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.