నా పదవికి రాజీనామా చేస్తా.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు
తన ఎంపీ పదవికి రాజీనమా చేస్తానని, తరువాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. వైసీపీపై, సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
తన పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. రాజీనామా చేసి వెంటనే ఎన్నికల్లో పోటీ చేస్తానని, దీంతో వైసీపీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటో అర్థమవుతుందని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడారు. వైసీపీ తనపై అనర్హత వేటు వేస్తుందనే వార్తలు వచ్చాయని, దాని కంటే ముందే తాను పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం చెప్పాలని పరోక్షంగా సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని అన్నారు. దాని కోసమే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
అమరావతి రాజధాని నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొన్ని మీడియా ఛానెల్స్ను, పత్రికలను బ్యాన్ చేశారని, దానిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కేవలం వైసీపీని బలోపేతం చేయడానికే వాలంటీర్, సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఏపీలో ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రతీ నెలలలో కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే వాలంటీర్లకు పని ఉంటోందని చెప్పారు. అయినా వారు ప్రభుత్వ అసవరాలను తీర్చలేకపోతున్నారని జగన్ అంటున్నారని, ఆ వ్యాఖ్యలు చాలా బాధకరమని తెలిపారు. ఉద్యోగులు ఏం తప్పు చేశారనే విషయం జగన్ తెలపాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాలు నిర్మించిన వారికి బిల్లులు అందించలేని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. గోదావరి జిల్లా గిరీష్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ను నిర్మించడంలో జగన్ విఫలమయ్యారని అన్నారు. ప్రశ్నించిన వారిని ఏసీబీ దాడులు నిర్వహిస్తే, వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు. జగన్పై, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రఘురామకృష్ణ ప్రస్తుతం వైసీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. నరసాపురం నియోజకర్గం నుంచి 2019 సంవత్సరంలో ఎంపీగా గెలిచారు. గత కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.