పవన్ కల్యాణ్ కట్టప్పను మించిపోయాడు: విజయసాయి రెడ్డి సెటైర్లు
చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలను ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ కట్టప్పను మించిపోయాడని వ్యాఖ్యానించారు.
అమరావతి: ఐటి దాడులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలను ప్రస్తావిస్తూ ఆ సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చిందని, కానీ ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేకపోతున్నారని విజయసాయి రెడ్డి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. జనం నవ్వుకుంటున్నారనే ఇంగితం కూడా లేకుండా పవన్ కల్యాణ్ యజమానిని సమర్థిస్తున్నారని ఆయన అన్ారు.
పీఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట.. అని అంటూ కట్టప్పను మించిపోయాడని ఆయన పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోందని ఆయన అన్నారు.
ఆదాయం పన్ను శాఖ కమిషన్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి పచ్చ మీడియా వెళ్లిపోయిందని, రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తిస్తే కాగు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్దపు ప్రచారం ప్రారంభించారని ఆయన అన్నారు.