ఉక్కు ఫ్యాక్టరీ: కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్తో టీడీపీ ఎంపీల భేటీ
ఉక్కు ఫ్యాక్టరీపై ఎంపీల పోరు
న్యూఢిల్లీ:కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్రం నుండి అందించినట్టు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు.
గురువారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్తో సమావేశమైన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కడపలో సీఎం రమేష్ చేస్తున్న దీక్ష 9వ రోజుకు చేరుకుంది. అటు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్తో మరోసారి భేటీ కావాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు.
అయితే ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందంటూ బీరేంద్ర సింగ్ తన నివాసం నుంచి పీఎంవోకు వెళ్లిపోయారు. దీంతో కేంద్రమంత్రి వచ్చేవరకు ఇక్కడే ఉంటామని టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని అక్కడే బైఠాయించారు.
అయితే పని ముగించుకుని తిరిగి వచ్చిన బీరేంద్ర సింగ్ టీడీపీ ఎంపీలు, ఉక్కుశాఖకు చెందిన అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈనెల 15న మెకాన్ సంస్థ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసి తమకు కావాల్సిన సమాచారం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 వ తేదినే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని పంపిందని ఆయన చెప్పారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను మూడు వేల ఎకరాలు ఉందన్నారు. అయితే మెకాన్ సంస్థకు 1800 ఎకరాలు మాత్రమే కావాలని కోరుతోన్న విషయాన్ని జేసీ గుర్తు చేశారు. ఎకరానికి రూ.4 లక్షలు చెల్లిస్తే సరిపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇచ్చినట్టు చెప్పారు.