ఉక్కు రాదు... తుక్కురాదు: మరోసారి జేసీ సంచలనం
జేసీ మరోసారి సంచలనం
న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్కు రాదు, తుక్కు రాదంటూ వ్యాఖ్యానించారు. గురువారం నాడు కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ ను కలిసిన తర్వాత జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా కూడా రాదని ఎంపీ జోస్యం చెప్పారు. పప్పు బెల్లాలు చిలకరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా వాస్తవాలని జేసీ పేర్కొన్నారు. ఈ విషయం నిరసన చేసే సీఎం రమేష్కు తెలుసు, నాకు తెలుసని చెప్పారు. ఇదంతా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకేనని ఎంపీ జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మూడువేల ఎకరాలు అందుబాటులో భూమి ఉంటే, మెకాన్ 18వందల ఎకరాలు కావాలని అని అడిగిందన్నారు. ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో 500 ఎకరాల ప్రైవేట్ భూమి కావాలంటున్నారు.
ఎకరానికి రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పాం.16కి.మీ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు.. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టినట్టు చెప్పారు. దొంగనాటకాలు, కుట్రలు జరుగుతున్నాయని జేసీ ఆరోపించారు. దీక్ష విరమించాలని మంత్రి ఫోన్ చేసి సీఎం రమేష్ ను కోరారని ఆయన చెప్పారు. మరో 24గంటల్లో అవసరమైన సమాచారం ఇస్తామని ఎంపీ జేసీ చెప్పారు.