సీఎం ఇంటికి కూతవేటు దూరంలో గ్యాంగ్ రేప్... ఇదీ మహిళల పరిస్థితి: జాతీయ మహిళా కమీషన్ కు అనిత లేఖ
ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలపై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాశారు టిడిపి మహిళా నాయకురాలు వంగలపూడి అనిత.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులపై విచారణ చేసేందుకు ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని జాతీయ మహిళా కమీషన్ ను కోరారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. కమీషన్ తక్షణ చర్యలు మహిళల్లో విశ్వాసాన్ని కలిగించడమే కాకుండా రాష్ట్రంలో మహిళలపై దాడులను అరికట్టడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ మేరకు ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలపై జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాశారు అనిత.
''గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ చర్యలు నేరాలను అరికట్టేలా కంటే నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి. దిశా చట్టం, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా మొబైల్ వెహికల్స్, దిశా యాప్ ల ప్రచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భ్రమలో పడేస్తున్నాయి'' అని అన్నారు.
''19 జూన్ 2021(శనివారం) నాడు కృష్ణా నది ఒడ్డున గల సీతానగరం పుష్కర్ ఘాట్ వద్ద మహిళ వేధింపులకు గురవ్వడం ఒక దురదృష్టకర సంఘటన. ఈ సంఘటన జరిగిన ప్రదేశం ముఖ్యమంత్రి నివాసంకు, డిజిపి, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూతవేటు దూరంలోనే ఉంది'' అని లేఖలో పేర్కొన్నారు.
read more ప్రియుడ్ని కట్టేసి గ్యాంగ్ రేప్: ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జ్
''22 జూన్ 2021 (మంగళవారం) నాడు దళిత మహిళ మల్లాది మరియమ్మ మధ్యాహ్నం 3 గంటలకు కొబ్బరి పొలాలకు వెళ్ళారు. సాయంత్రం 6 గంటలకు ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మరియమ్మను చాలా కాలం క్రితం భర్త వదిపెట్టినా తన కుమార్తెకు ఒంటరిగా పెంచి వివాహం చేసింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో జరిగింది'' అని తెలిపారు.
''ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం మహిళల రక్షణ కోసం చేస్తుంది సున్నా. ప్రభుత్వం చేసినదల్లా దిశా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, దిశా మొబైల్ వెహికల్స్ పేరిట వైసీపీ రంగులు వేసుకోవడమే. ఇప్పుడున్న చట్టాలను సరిగా అమలు చేస్తే మహిళా రక్షణ కు ఎటువంటి డోకా ఉండదు. ఏపీ లో మహిళల పై జరిగే దాడుల గురించి తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాలని కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాను'' అంటూ లేఖలో పేర్కొన్నారు అనిత.