విక్రయానికి భార్య నగ్న వీడియోలు: ఎవరీ వంశీకాంత్ రెడ్డి?
భార్య నగ్న వీడియోలను అమ్మకానికి పెట్టిన వంశీకాంత్ రెడ్డిది విచిత్రమైన ప్రవర్తన. అతను భార్య నగ్న ఫొటోలను, వీడియోలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి అమ్మకానికి పెట్టాడు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో భార్య నగ్న చిత్రాలను యాప్ ద్వారా విక్రయానికి పెట్టిన ఆమె భర్త వంశీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ ఎమ్మిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
బాధిత మహిళ భర్త వంశీకాంత్ రెడ్డిని అరెస్టు చేసి అతని నుంచి రెండు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బొంతా వంశీకాంత్ రెడ్డి హైదరాబాదులోని సౌదీ ఎయిర్ లైన్స్ కార్గో విభాగంలో కొంత కాలం ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆటరేళ్ల క్రితం గుంటూరులోని ఏటీ అగ్రహారానికి భార్యతో కలసి మకాం మార్చాడు.
కొంత కాలం కొరియర్ పాయింట్ నిర్వహించాడు. అయితే అందులో నష్టాలు వచ్చాయి. దాంతో అతను ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తమ కొడుకు పనులు లేక ఖాళీగా ఉంటున్నాడని, వ్యాపారం కోసం అదనపు కట్నం తీసుకురావాలని వంశీకాంత్ రెడ్డి తల్లిదండ్రులు బాధిత మహిళను వేధించసాగారు.
ఆ క్రమంలోనే వంశీకాంత్ రెడ్డి ఈ ఏడాది జూన్ లో భార్య నగ్నంగా ఉన్న దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశాడు. వాటిని డార్లింగ్ పేరుతో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. రూ.300 చెల్లిస్తే వాటిని కోరిన వ్యక్తులు డౌన్ లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశాడు.
గుంటూరులోని గాంధీనగర్ కు చెందిన బచ్చు శివశంకర్ ఆ వీడియోను కొనుగోలు చేశాడు. టెక్కలికి చెందిన వంశీకాంత్ రెడ్డి మిత్రుడు సంతోష్ తో చాటింగ్ చేస్తూ తన భార్యతో సంబంధం పెట్టుకోవాలని సూచించాడు. అప్పటి నుంచి బాధితురాలికి సంతోష్ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చాడు.
ఈ క్రమంలో తన నగ్న చిత్రాలు, వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని తెలుసుకుని, అది తన భర్త పనే అని గుర్తించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసుుల టెక్నికల్ విభాగం సహకారంతో దర్యాప్తు సాగించారు. తగిన ఆధారాలు సేకరించి వంశీకాంత్ రెడ్డిని, వీడియో కొనుగోలు చేసిన శివశంకర్ ను అరెస్టు చేశారు