ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాయపాటి
తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ మీద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు.
అమరావతి: తమ పార్టీ పార్లమెంటు సభ్యులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ మీద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు తెగించి సీఎం రమేష్ దీక్ష చేస్తుంటే మోడీకి చీమ కుట్టినట్లు కూడా లేదని రాయపాటి గురువారం మీడియా సమావేశంలో విమర్శించారు. ఏపీ ప్రయోజనాలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన చెప్పారు.
బీజేపీ, వైసీపీలు కలిసి 5 కోట్ల ప్రజలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పీఎంవో 420లకు అపాయింట్మెంట్ ఇస్తుందని, కేసులు మాఫీ కోసం వచ్చే వారికి అపాయింట్మెంట్ ఇస్తుందని ఆయన అన్నారు.
కానీ ప్రజాసేవల కోసం వచ్చిన వారికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోడం బాధాకరమని, తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆయన అన్నారు.