పూట గడవక, భారంగా జీవితం: డబ్బు ఆశ చూపి.. బాలికను వ్యభిచార రొంపిలోకి
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఓ మైనర్ బాలికకు డబ్బు ఆశ చూపిన ఓ ముఠా ఆమెను వ్యభిచార కూపంలోకి దింపారు
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఓ మైనర్ బాలికకు డబ్బు ఆశ చూపిన ఓ ముఠా ఆమెను వ్యభిచార కూపంలోకి దింపారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నగరంలో ఓ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి కుటుంబాన్ని వదిలి మరో చోటికి వెళ్లిపోవడంతో వీరిని ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పూట గడవటం కూడా కష్టంగా మారింది.
దీంతో ఆ బాలిక ఆరు నెలల క్రితం కొద్ది నెలల క్రితం విజయవాడలోని తన చిన్నమ్మ ఇంటికి వచ్చింది. అక్కడ రామకృష్ణ అనే వ్యక్తి , అతని భార్య బాలికకు పరిచయమయ్యారు. తన కుటుంబ పరిస్ధితిని వివరించి సాయం చేయాలని కోరింది.
తాము చెప్పినట్లు వింటే కష్టాల్లోంచి బయటపడొచ్చని నమ్మించి ఆ బాలికను వ్యభిచారంలోకి దించారు. బెజవాడలో కొంతకాలం వుంచి ఆ తర్వాత లాక్డౌన్కు ముందు ఆమెను నెల్లూరు నగరంలోని హరనాథపురంలోని ఓ మహిళ వద్ద ఉంచారు.
Also Read:లాక్ డౌన్ లోనూ వ్యభిచారం.. యువతుల అరెస్ట్
రామకృష్ణ దంపతులు, మహిళ, ఆమె తమ్ముడు పృథ్వీరాజ్, మరిది వినయ్ కుమార్ తమకు పరిచయం వున్న వారి వద్దకు బాలికను పంపి బాగా సంపాదించారు. కానీ ఆమెకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇచ్చేవారు కాదు.
వీరి వేధింపులను భరించలేకపోయిన ఆ బాలిక తన తల్లి వద్దకు వెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించగా.. వారు అడ్డుకోసాగారు. ఈ నేపథ్యంలో మే 29న బాలికను నిర్వాహకులు కారులో ఎక్కించుకుని మైపాడు వద్ద వదిలిపెట్టారు.
అప్పటికే అక్కడ మోటారు సైకిల్తో సిద్ధంగా ఉన్న శ్రీనాథ్ అనే వ్యక్తి బాలికను బైక్పై ఎక్కించుకుని ఓ చోట తన కామవాంఛను తీర్చుకున్నాడు. అనంతరం అర్థరాత్రి తర్వాత బాలికను నిర్వాహకుల వద్ద వదిలిపెట్టాడు.
తిరిగి కారులో ఆమెను ఎక్కించుకున్న వారు నెల్లూరుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఇందుకూరుపేట మండల పరిధిలోని మొత్తలు వద్ద వారు కారు రోడ్డుపై ఆపి మూత్ర విసర్జనకు వెళ్లగా ఇదే అదనుగా భావించి ఆమె తప్పించుకుంది.
ఎలాగోలా పోలీస్ స్టేషన్కు చేరుకుని మే 30న ఇందుకూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read:విదేశీ యువతుల అక్రమ రవాణా, వ్యభిచారం: మహిళ అరెస్టు
ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితులు రామకృష్ణ, అతని భార్య పరారవ్వగా, మిగిలిన వారిని మే 31వ తేదీ సాయంత్రం కొరుటూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని సూత్రధారులను కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
కాగా ఈ మొత్తం వ్యవహారంలో నెల్లూరు జిల్లాకే చెందిన ఓ పోలీస్ అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు విచారణలో ఉందన్న డీఎస్పీ.. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.